క్రియాయోగ ధ్యాన మార్గము

వెలిగించబడిన స్మృతి మందిరం, రాంచీ

“సహస్రాబ్దులుగా భారతదేశంలోని ఋషులకు, యోగులకు మరియు ఏసుకు తెలిసిన ఖచ్చితమైన ధ్యాన శాస్త్రం ద్వారా – ఏ దైవాన్వేషకుడైనా తన చైతన్యాన్ని సర్వజ్ఞత్వమునకు విస్తరింపజేసి తనలోనే ఉన్న విశ్వవ్యాప్తమైన భగవంతుని జ్ఞానాన్ని స్వీకరించగలుగుతాడు.”

— పరమహంస యోగానంద

జ్ఞానం, సృజనాత్మకత, భద్రత, ఆనందం, బేషరతైన ప్రేమ – వీటిల్లో ఏది మనకు నిజమైన, శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుందో ఖచ్చితంగా చెప్పగలమా?

పరమహంస యోగానందగారి క్రియాయోగ బోధనలు ప్రతి ఒక్కరికీ నేర్పేదేమిటంటే – మన ఆత్మలోనే దివ్యత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం, దివ్యానందాన్ని మన ఆనందంగా సొంతం చేసుకోవడం.

పవిత్రమైన క్రియాయోగ శాస్త్రము ఆధునిక ధ్యాన ప్రక్రియలను కలిగి ఉంటుంది. వీటిని అంకితభావంతో సాధన చేసినప్పుడు ఆత్మ అన్ని బంధాల నుండి విముక్తి చెంది దైవసాక్షాత్కారం పొందుతుంది. ఇది రాజోచితమైన లేదా మహోన్నతమైన యోగ పద్ధతి, దివ్య సంయోగం. (“వాట్ ఈజ్ యోగ రియల్లీ ?”ను చదవండి.)

క్రియాయోగ చరిత్ర

విజ్ఞులైన భారతీయ ఋషులు ప్రాచీనకాలంలోనే ఆధ్యాత్మిక శాస్త్రమైన క్రియాయోగాన్ని కనుగొన్నారు. శ్రీకృష్ణ భగవానుడు ఈ విషయం గురించి భగవద్గీతలో ప్రశంసించారు. ఋషి పతంజలి తన యోగసూత్రాలలో కూడా దీని గురించి ప్రస్తావించారు. ఈ పురాతన ధ్యాన పద్ధతి ఏసు క్రీస్తుతో పాటు సెయింట్ జాన్, సెయింట్ పాల్ వంటి శిష్యులకు కూడా తెలుసునని పరమహంస యోగానందగారు పేర్కొన్నారు.

క్రియాయోగ శాస్త్రం శతాబ్దాలపాటు అంధ యుగాల్లో మరుగున పడిపోయి, మహావతార్ బాబాజీ ద్వారా ఆధునిక యుగంలో పునరుద్ధరించబడింది. ఆయన శిష్యులైన లాహిరీ మహాశయులు (1828–1895) మనయుగంలో క్రియాయోగాన్ని బాహ్యప్రపంచానికి బోధించిన మొదటి వ్యక్తి. ఆ తరువాత, లాహిరీ మహాశయుల శిష్యులైన స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరిని (1855-1936), ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించే ఈ ప్రక్రియలో శ్రీ పరమహంస యోగానందగారికి శిక్షణ ఇవ్వమనీ మరియు ఆయనను పశ్చిమ దేశాలకు పంపి ఈ ప్రక్రియను ప్రపంచానికి అందించేట్టు చేయమనీ బాబాజీ కోరారు.

సనాతనమైన క్రియాయోగ శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యాన్వేషకులకు అందించడానికి పరమహంస యోగానందగారు, వారి విశిష్టమైన గురు పరంపర ద్వారా ఎంపిక చేయబడ్డారు. ఈ ప్రయోజనం కోసమే ఆయన 1917లో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాను, 1920లో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ను స్థాపించారు.

గతంలో కేవలం సర్వసంగపరిత్యాగులై, ఏకాంత జీవితాన్ని గడిపే విశ్వాసపాత్రులైన కొద్దిమంది సన్యాసులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ప్రాచీన క్రియాయోగ శాస్త్రం భారతీయ మహోన్నతుల చేత పరమహంస యోగానందగారి ద్వారా మరియు ఆయన స్థాపించిన సంస్థ (వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.) ద్వారా ప్రపంచంలోని చిత్తశుద్ధిగల అన్వేషకులందరికీ అందించబడుతోంది.

Mahavatar Babaji Altar photo
lahiri mahasaya altar photo
స్వామీ శ్రీ యుక్తేశ్వరులు
Paramahansa Yogananda Alter kriya yoga

యోగానందగారు ఇలా అన్నారు: “1920లో నేను అమెరికాకు వచ్చేముందు మహావతార్ బాబాజీ నన్ను ఆశీర్వదించడానికి వచ్చినపుడు, ఈ పవిత్రమైన కార్యసాధనకు నన్ను ఎంపిక చేసినట్టు ఆయన చెప్పారు; ‘పశ్చిమదేశాలలో క్రియాయోగ వ్యాప్తికి నేను ఎంపిక చేసింది నిన్నే. చాలాకాలం క్రితం నీ గురువు యుక్తేశ్వర్ ను నేను కుంభమేళాలో కలుసుకున్నాను; నిన్ను తన దగ్గరికి శిక్షణకు పంపుతానని అప్పుడు ఆయనకు చెప్పాను.’ బాబాజీ భవిష్యత్తును సూచిస్తూ, ‘క్రియాయోగమనే దైవ సాక్షాత్కార ప్రక్రియ చివరకు అన్ని దేశాలలోనూ విస్తరించి – అనంతుడైన దైవాన్ని ప్రతి మనిషీ తన వ్యక్తిగత అతీంద్రియ అవగాహన ద్వారా దర్శింపచేసి – దేశాల మధ్య సామరస్యం పెరగడానికి దోహదపడుతుంది” అని అన్నారు.

క్రియాయోగ శాస్త్రం

అత్యంత వేగవంతమైన, ఫలమంతమైన ఏ యోగ సాధన మార్గం అయినా – తిన్నగా చైతన్యశక్తికి సంబంధించిన ధ్యాన విధానాన్నే అవలంభిస్తుంది. ఈ ప్రత్యక్ష విధానమే పరమహంస యోగానంద బోధించిన ప్రత్యేకమైన ధ్యానపద్ధతి యొక్క ముఖ్య లక్షణం. ప్రత్యేకించి చెప్పాలంటే క్రియాయోగం ఒక ఆధునిక రాజయోగ పద్ధతి. ఇది శరీరంలోని ప్రాణశక్తి యొక్క సూక్ష్మప్రవాహాన్ని పునరుజ్జీవింప చేసి శక్తివంతం చేస్తుంది. తద్వారా గుండె మరియు ఊపిరితిత్తులపై పని ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫలితంగా, మనిషిలోని చైతన్యశక్తి అతని అవగాహనా లక్షణాలను ఉన్నత లక్ష్యాలవైపు మళ్ళిస్తుంది. అప్పుడు క్రమేణా అతని అంతరంగంలో వికసించే అలౌకిక ఆనందం – సాధారణ మానసికానందాలకన్నా, ఇంద్రియానుభవాలకన్నా అధిక సంతృప్తిని, సంతోషాన్ని కలుగచేస్తుంది. అన్ని పవిత్ర గ్రంథాలు మానవుణ్ణి నశించిపోయే శరీరంగా కాకుండా ఒక జీవాత్మగా ప్రకటిస్తాయి. ప్రాచీనమైన ‘క్రియాయోగ’ శాస్త్రం పవిత్ర గ్రంథాలలోని సత్యాన్ని నిరూపించడానికి ఒక మార్గాన్ని బోధిస్తుంది. అంకితభావంతో క్రియాయోగాన్ని ప్రణాళికాబద్ధంగా సాధన చేసినప్పుడు, దాని సామర్థ్యాన్ని వివరిస్తూ పరమహంస యోగానందగారు ఇలా ప్రకటించారు: “ఇది గణితం వలె పనిచేస్తుంది; విఫలం కాదు.”

క్రియాయోగ మార్గంలో ధ్యాన పద్ధతులు

‘భగవంతుడు సంసిద్ధంగా ఉన్న హృదయాలపై తన అపారమైన అనుగ్రహాన్ని కురిపించాలని చూస్తుంటాడు…’ ఎంతో అందమైన సత్యం కదా. ఆ విషయాన్ని నేను నమ్ముతాను.ఆయన ప్రతిదాన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాని వాటిని స్వీకరించే అర్హతను పొందే ప్రయత్నం చెయ్యడానికి మాత్రం మనం సిద్ధంగా లేము.”

పరమహంస యోగానందగారు తమ ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో క్రియాయోగం గురించి వివరించారు. పరమహంస యోగానందగారు బోధించిన మూడు ప్రాధమిక ప్రక్రియలను మొదట కొంతకాలం అధ్యయనం, సాధన చేసిన తరువాత యోగదా సత్సంగ పాఠాల విద్యార్థులకు అసలైన క్రియాయోగ ప్రక్రియ ఇవ్వబడుతుంది.

ఈ ధ్యాన ప్రక్రియలను అభ్యాసం చేసే సాధకుడు పురాతన యోగశాస్త్రము యొక్క అత్యధిక ప్రయోజనాలను మరియు దివ్య లక్ష్యాన్ని సాధించగలడు.

1. శక్తిపూరణ వ్యాయామాలు

ధ్యానం కోసం శరీరాన్ని సిద్ధం చేయడానికి 1916లో పరమహంస యోగానందగారు మానసిక శారీరకమైన వ్యాయామాలను ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చేశారు. వీటిని క్రమం తప్పకుండ సాధన చేస్తే, మానసిక, శారీరక సాంత్వన కలగడమే కాకుండా, క్రియాశీలకమైన సంకల్పశక్తి కూడా మెరుగు పడుతుంది. శ్వాస, ప్రాణశక్తి మరియు ఏకాగ్రతతో కూడిన ధ్యాసను ఉపయోగించుకుని, ఈ ప్రక్రియ శరీరంలోకి చైతన్యశక్తిని నింపుతుంది. ఆ శక్తి అన్ని శరీర భాగాలను శుద్ధి చేసి, ఒక క్రమపద్ధతిలో బలోపేతం చేస్తుంది. శక్తిపూరణ వ్యాయామాలు ఒకసారి అభ్యసించడానికి సుమారు 15 నిమిషాలు పడుతుంది. ఇవి మానసిక ఒత్తిడులను నరాల ఉద్రిక్తలను తొలగించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. ధ్యానానికి ముందు వాటిని సాధన చేసినప్పుడు దోహదం చేస్తాయి.

2. హాంగ్-సా ఏకాగ్రతా ప్రక్రియ

హాంగ్-సా ఏకాగ్రతా ప్రక్రియ, ఏకాగ్రత యొక్క అగోచర శక్తులను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియ యొక్క అభ్యాసం ద్వారా ఆలోచనలను, శరీరశక్తిని – బాహ్యాకర్షణల నుండి మళ్లించి, ఏదైనా ఒక కార్యసాధనకో, సమస్యా పరిష్కారానికో వినోయోగించవచ్చు. లేదా ఆ సంఘటితమైన ఏకాగ్రతా శక్తిని మనలో ఉన్న దివ్య చైతన్యాన్ని దర్శించే దిశగా కూడా వినియోగించవచ్చు.

కృష్ణ భగవానుడు మరియు క్రియాయోగ

పరమహంస యోగానందగారి ఆశయాల్లో ముఖ్యమైన ఉద్దేశం – ‘భగవాన్ శ్రీకృష్ణుడు బోధించిన అసలైన యోగములోను, ఏసు క్రీస్తు బోధించిన అసలైన క్రైస్తవంలోను ఉన్న సంపూర్ణ సామరస్యాన్ని మరియు మౌలిక ఏకత్వాన్ని బహిర్గతపరచడం; మరియు ఈ నిత్యసత్యమైన సూత్రాలు – నిజమైన అన్ని మత మార్గాలన్నిటికీ పునాది స్థంభాలని’ చూపించడం.

“గాడ్ టాక్స్ విత్ అర్జున: ది భగవద్గీత (God Talks With Arjuna: The Bhagavad Gita), IV: 29”లో ఇలా చెప్పబడింది – సాధకులు – ఉచ్ఛ్వాసాన్ని నిశ్వాసం కోసం, అలాగే నిశ్వాసాన్ని ఉఛ్వాసం కోసం వినియోగిస్తూ, రెండు శ్వాస ప్రక్రియలను సమతుల్యం చేస్తున్నారు. ఆ ప్రకారంగా నిరంతర ‘క్రియాయోగా ప్రాణశక్తి నియంత్రణ’ అభ్యాసం ద్వారా, వారు శ్వాసప్రక్రియ ప్రాధాన్యతనే తగ్గిస్తున్నారు.

The Bhagavad Gita

3. ఓం ధ్యాన ప్రక్రియ

“ఓం ధ్యాన ప్రక్రియ” – ఏకాగ్రతాశక్తిని ఉపయోగించి మన స్వీయ ఆత్మలో నిక్షిప్తమై ఉన్న దివ్య గుణాలను ఎలా కనుగొనాలో, ఎలా అభివృద్ధి చేసుకోవాలో చూపుతుంది. సృష్టిలో అంతర్లీనంగా ఉండి, సృష్టిని కొనసాగిసింపచేసే శబ్దరూపంలో ఉన్న ఓంకారం లేదా పవిత్రాత్మగా అంతటా ఉన్న భగవంతుని ఉనికిని అనుభవంలోకి ఎలా తెచ్చుకోవాలో ఈ ప్రాచీన పద్ధతి బోధిస్తుంది. ఈ ప్రక్రియ మనలో ఉండే అపారమైన సామర్థ్యాన్ని ఒక ఆనందకరమైన సాక్షాత్కారంగా, మన శారీరక, మానసిక పరిమితులను అధిగమించి మరీ విస్తరింపచేస్తుంది.

4. క్రియాయోగ ప్రక్రియ

క్రియ, రాజయోగంలోని ఒక అత్యున్నత ప్రాణాయామ (ప్రాణ-శక్తి నియంత్రణ) ప్రక్రియ. క్రియ వెన్నెముక మరియు మెదడులోని ప్రాణ శక్తి యొక్క సూక్ష్మ ప్రవాహాలను, బలోపేతం చేసి పునరుద్ధరిస్తుంది. భారతీయ సనాతన ఋషులు మెదడు మరియు వెన్నెముకను జీవ వృక్షంగా భావించారు. ప్రాణానికి, చైతన్యానికి చెందిన వెనుబాములోని సూక్ష్మ కేంద్రాల(చక్రాలు) నుండి నరాలకు, శరీరంలోని ప్రతి అవయవానికి మరియు కణజాలానికి శక్తిని ప్రవహింపచేసి పునరుజ్జీవనం కలుగచేస్తుంది. యోగులు ప్రత్యేక క్రియాప్రక్రియ ద్వారా ప్రాణశక్తి ప్రవాహాలను క్రింద నుంచి పైకి, పైనుంచి క్రిందికి నిరంతరంగా తిప్పడం ద్వారా, మనిషి ఆధ్యాత్మిక పరిణామాన్ని మరియు అవగాహనను వేగవంతం చేయడం సాధ్యమవుతుందని కనుగొన్నారు.

క్రియాయోగా యొక్క సక్రమమైన అభ్యాసం, గుండె, ఊపిరితిత్తులు మరియు నాడీ వ్యవస్థ యొక్క సాధారణ కార్యకలాపాలను సహజమార్గంలో నెమ్మదింపచేస్తుంది. తద్వారా గాఢమైన ఆంతరంగిక, శారీరక, మానసిక నిశ్చలత్వం సాధించి, దృష్టిని ఆలోచనలు, భావోద్వేగాలు మరియు ఇంద్రియ సంవేదనల యొక్క సాధారణ అలజడుల నుండి విముక్తం చేస్తుంది. అంతఃనిశ్చలత ద్వారా వచ్చే స్పష్టతలో ఆత్మలోని గాఢమైన అంతఃశాంతిని మరియు దేవునితో అనుసంధానాన్ని అనుభవించగలుగుతాడు.

మానవ శరీరంలోని ఏడు చక్రాలుక్రియాయోగం నేర్చుకోవటం ఎలా​

క్రియాయోగం నేర్చుకోడానికి తొలిమెట్టు- యోగదా సత్సంగ పాఠాల కోసం దరఖాస్తు చేసుకోవడం. మొదటి సంవత్సరంలో ఇంటి నుండే పాఠాలు అధ్యయనం చేస్తూ విద్యార్థులు ధ్యానం యొక్క మూడు ప్రాథమిక ధ్యాన ప్రక్రియలను (పైన వివరించిన విధంగా), మరియు పరమహంసగారు బోధించిన సమతుల్య ఆధ్యాత్మిక జీవన సూత్రాలను నేర్చుకుంటారు.

ఈ రకంగా క్రమబద్దీకరింపబడిన బోధనా విధానానికి ఒక ప్రయోజనం ఉంది. హిమాలయాలను అధిరోహించాలనుకునే పర్వతారోహకుడు శిఖరాలను అధిరోహించే ముందు, ఆ వాతావరణానికి తనను తాను అలవాటు పడవలసి ఉంటుంది. అదేవిధంగా సత్యాన్వేషకుడు కూడా తన అలవాట్లను, ఆలోచనలను సరిచేసుకొని, మనస్సును ఏకాగ్రతతోను మరియు భక్తితోను పటిష్టం చేసుకొని, శరీరపు ప్రాణశక్తిని ఒక ధ్యేయం మీద కేంద్రీకరించగలిగే దిశగా అభ్యాసం చేయడానికి ఈ ప్రారంభకాలం అవసరమవుతుంది. ఆ తరువాత యోగసాధకుడు వెన్నెముక అనే రాజమార్గం ద్వారా సాక్షాత్కారాన్ని చేరుకోవడానికి సన్నద్దుడవుతాడు. ఈ విధంగా ఒక సంవత్సరం పాటు అధ్యయనము మరియు సాధన చేసిన తరువాత విద్యార్థులు క్రియాయోగ దీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత సంపాదిస్తారు. అప్పుడు అధికారికంగా శ్రీ పరమహంస యోగానందగారితోను మరియు జ్ఞానపూర్ణులైన వారి గురుపరపరతోను గురు-శిష్య సంబంధాన్ని ఏర్పరచుకుంటారు.

యోగదా సత్సంగ పాఠాల కోసం మీరు ఇంకా నమోదు చేసుకోకపోయినట్లైతే, ధ్యానం ఎలా చెయ్యాలి అనే దానిపై కొన్ని ప్రారంభ సూచనలను ఈ పేజీలలో తెలుసుకోవచ్చు. వాటిని వెంటనే ఆచరణలో పెట్టి ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను అనుభవంలోకి తెచ్చుకోవచ్చు.

స్మృతి మందిరంలో ధ్యానం చేస్తున్న భక్తుడు, రాంచీ

గురుశిష్య సంబంధం

క్రియాయోగం అనేది, యోగదా సత్సంగ సొసైటీ యొక్క దీక్షా ప్రక్రియ. శ్రీ పరమహంస యోగానందగారిని తమ గురువుగా (ఆధ్యాత్మిక మార్గదర్శకునిగా) అంగీకరించి క్రియాయోగ దీక్ష తీసుకున్న విద్యార్థులు పవిత్రమైన గురుశిష్య సంబంధంలోకి అడుగుపెడతారు. గురుశిష్య సంబంధం గురించి మరింత చదవండి.</p

క్రియాయోగం గురించి మరింత చదవండి

ప్రార్థనలో భక్తుడిని చూస్తున్న భగవంతుని కళ్ళు

పరమహంస యోగానందగారి ప్రసంగాలలో మరియు రచనలలో వివరించిన విధంగా క్రియాయోగ యొక్క ప్రయోజనాల గురించి మరింత వివరంగా తెలుసుకోండి.

పరమహంస యోగానంద

ఆత్మవిముక్తి సాధన దిశలో సర్వశ్రేష్ఠమైన ప్రక్రియగా క్రియాయోగ యొక్క స్వభావం, పాత్ర మరియు సమర్థతపై పరమహంస యోగానందగారి రచనల నుండి కొన్ని ప్రచురణలు.

క్రియాయోగ మీ మెదడు కణాలను మారుస్తుంది

మీ మెదడులో, చెడు అలవాట్లను అధిగమించడానికి ఒక నిర్దిష్ట మార్గంతో సహా, ఎన్నో ప్రయోజనకరమైన మార్పులను తీసుకురావడానికి – క్రియాయోగ ఎలా సహాయపడుతుందనే దాని గురించి మరింతగా తెలుసుకోండి.

క్రియాయోగ - 150 సంవత్సరాలు

2011లో ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. జరుపుకున్న 150వ క్రియాయోగ పునరుద్ధరణ వార్షికోత్సవ – జ్ఞాపకార్థం.

క్రియా యోగ వృక్షాన్ని వర్ణించే పువ్వు

పరమహంస యోగానందగారు బోధించిన ఈ పవిత్ర ఆత్మజ్ఞాన శాస్త్రం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఆశీస్సులు పొందిన వేలాది మంది సాధకులలో కొందరి ప్రశంసాపత్రాలు.

ఇతరులతో షేర్ చేయండి