స్వామి శ్రీయుక్తేశ్వర్

స్వామి శ్రీయుక్తేశ్వర్

స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు మే 10, 1855న భారతదేశంలోని బెంగాల్‌లోని శ్రీరాంపూర్ లో జన్మించారు. శ్రీయుక్తేశ్వర్ గారు లాహిరీ మహాశయుల వారి శిష్యులు మరియు జ్ఞానావతార్ లేదా జ్ఞానం యొక్క అవతారం అనే ఆధ్యాత్మిక స్థాయిని సాధించారు.

ఆధునిక ప్రపంచంలోని భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక బాధలను ఉపశమింప చేయుటకు పశ్చిమ దేశాల విజ్ఞానము మరియు సాంకేతికతతో తూర్పు ఆధ్యాత్మిక వారసత్వాన్ని సమన్వయం చేయడం చాలా ఉపయోగపడుతుందని శ్రీయుక్తేశ్వర్ గారు గుర్తించారు. ఈ ఆలోచనలు 1894లో లాహిరీ మహాశయుల వారి గురుదేవులైన మహావతార్ బాబాజీ గారితో జరిగిన అద్భుతమైన సమావేశము ద్వారా కార్యరూపం దాల్చాయి.

బాబాజీ స్వామి శ్రీయుక్తేశ్వర్ గారితో, “నా అభ్యర్థన మేరకు, స్వామీజీ, మీరు క్రైస్తవ మరియు హిందూ గ్రంథాల మధ్య అంతర్లీన సామరస్యం గురించి ఒక చిన్న పుస్తకాన్ని వ్రాయగలరా? వారి ప్రాథమిక ఐక్యత నేటి మనుష్యుల వర్గ విభేదాలతో మరుగున పడింది. దైవ స్ఫూర్తి కలిగిన భగవంతుని కుమారులు అవే సత్యాలను మాట్లాడారని సమాంతర సూచనల ద్వారా చూపండి.”

శ్రీయుక్తేశ్వర్ గారు ఇలా గుర్తు చేసుకున్నారు: “నిశ్శబ్ద రాత్రిలో నేను బైబిల్ మరియు సనాతన ధర్మ గ్రంథాల పోలికపై పనిచేస్తూ ఉన్నాను. ధన్యుడైన ఏసు ప్రభు మాటలను ఉటంకిస్తూ, నేను ఆయన బోధనల సారాంశము, మరియు వేదాలు వెల్లడించినది ఒకటే అని చూపించాను. మా పరమగురువుల దీవెనలతో, నా పుస్తకం, ది హోలీ సైన్స్ (The Holy Science), తక్కువ సమయంలో పూర్తయింది.”

స్వామి శ్రీయుక్తేశ్వర్‌ గారి దగ్గరకు పరమహంస యోగానందుల వారు యువకుడిగా ఉన్నప్పుడు వచ్చారు. ఆ గొప్ప గురువు తన యువ శిష్యుడికి, 1894లో వారి సమావేశం సందర్భంగా, మహావతార్ బాబాజీ ఇలా తెలియజేశారు: “తూర్పు మరియు పడమర మధ్య రాబోతున్న సామరస్య మార్పిడిలో స్వామీజీ మీరూ, ఒక పాత్ర పోషించాల్సి ఉంది. కొన్ని సంవత్సరాల తరువాత, పాశ్చాత్య దేశాలలో యోగ విద్య వ్యాప్తి కొరకు మీరు శిక్షణ ఇవ్వటానికి ఒక శిష్యుడిని నేను మీకు పంపుతాను. అక్కడి, అనేక ఆధ్యాత్మికత కోరుకునే ఆత్మల ప్రకంపనలు నాకు వరదలా వస్తున్నాయి. నేను అమెరికా మరియు యురోప్ లో మేలుకొలుపు కొరకు వేచి ఉన్న సంభావ్య సాధువులను గమనిస్తున్నాను.” అని తెలియజేశారు.

దీనిని వివరించిన తరువాత, శ్రీయుక్తేశ్వర్ గారు యోగానందగారితో ఇలా అన్నారు, “సంవత్సరాల క్రితం, బాబాజీ నా వద్దకు పంపుతానని వాగ్దానం చేసిన శిష్యుడివి, నీవే నాయనా.”

శ్రీయుక్తేశ్వర్ గారి ఆధ్యాత్మిక శిక్షణ మరియు క్రమశిక్షణలో, శ్రీ యోగానందుల వారు తన ప్రపంచవ్యాప్త ధర్మ కార్యమును పశ్చిమంలో ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. శ్రీయుక్తేశ్వర్ గారు తన ఆధ్యాత్మిక బాధ్యతలకు మరియు ఆశ్రమ ఆస్తులకు పరమహంస యోగానందగారే ఏకైక వారసులని పేర్కొన్నారు.

పరమహంసగారు అమెరికాలో పదిహేనేళ్లు ఉండి తిరిగి వచ్చి, భారతదేశ పర్యటనలో ఉన్న సమయంలో, మార్చి 9, 1936న స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు మహా సమాధి పొందారు.

ఇతరులతో పంచుకోండి