అమర మహాయోగి అయిన మహావతార్ బాబాజీ, మానవచైతన్యం యొక్క ఉద్ధరణ కోసం, పురాతన ఆత్మసాక్షాత్కార ప్రక్రియయైన ప్రాచీన క్రియాయోగ శాస్త్రాన్ని 1861లో తన శిష్యులైన లాహిరీ మహాశయులకి ప్రసాదించడం ద్వారా పునరుద్ధరించారు. వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క మహోన్నత గురుపరంపరలో పరమోత్కృష్ట గురుదేవులు బాబాజీ. ప్రత్యేక విధుల నిర్వహణలో ప్రవక్తలకు తోడ్పడ్డమే ఈ దివ్యావతారుల ధ్యేయం.
బాబాజీ మానవాళి ఆధ్యాత్మిక పరిణామానికి నిశ్శబ్దంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. ఆయనను కలిసినవారు ఆయన స్వభావం స్వచ్ఛమైన ప్రేమ అని, వినయం ఆయన ప్రత్యేక లక్షణమని చెబుతారు. ఆయన పవిత్ర నామాన్ని భక్తిశ్రద్ధలతో ఉచ్ఛరించిన మాత్రానే తక్షణ ఆశీర్వాదం లభిస్తుందని అంటారు.
మహావతార్ బాబాజీ గురించి
బదరీనారాయణ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఉత్తర హిమాలయ ప్రాంతం, బాబాజీ ఉనికితో ఈనాటికీ పునీతమవుతున్నది. బాబాజీ లాహిరీ మహాశయుల పూజ్య గురుదేవులు. ఏకాంతవాసులయిన ఈ మహానుభావులు అనేక శతాబ్దులుగా – బహుశా అనేక సహస్రాబ్దులుగా – తమ భౌతికరూపాన్ని నిలుపుకొంటున్నారు. మరణంలేని బాబాజీ అవతారపురుషులు. సంస్కృతంలో అవతరించడం అంటే “కిందికి దిగడం” అని అర్థం. అవతార శబ్దంలో ‘అవ’ అనే ఉపసర్గకు “కిందికి” అనీ, ‘తృ’ అనే ధాతువుకు “దాటడం” అనీ అర్థాలు. హిందూ పవిత్రగ్రంథాల్లో ఈ అవతారశబ్దం, దైవం భౌతిక శరీరరూపంలోకి దిగిరావడం అన్న అర్థాన్ని సూచిస్తుంది.
— ఒక యోగి ఆత్మకథ లో పరమహంస యోగానంద
![]()
పరమహంస యోగానందగారు వ్రాసిన ఒక యోగి ఆత్మకథ ద్వారానే, నిజంగా అద్భుతమైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వమైన మహావతార్ బాబాజీ గురించి ప్రపంచానికి తెలిసింది. పరమహంసగారు తమ ఆత్మకథలో ఇలా వ్రాశారు, “బాబాజీ కుటుంబాన్ని గురించి కాని, జన్మస్థలాన్ని గురించి కాని చరిత్రకారునికి ప్రీతిపాత్రమయే పరిమితి విధించే వాస్తవాలేవీ వెల్లడి కాలేదు.” ఇంకా ఆయన ఇలా వివరించారు, “అన్ని బంధాల నుంచీ విముక్తులయిన ఈ మహాగురువుల గోత్రనామాలేవో తెలియకపోతే నష్టమేమిటి?”
“…ఆయన మాట్లాడేది సాధారణంగా హిందీలో; కాని ఏ భాషలో నయినా అవలీలగా మాట్లాడగలరు. ఈయన బాబాజీ (గౌరవనీయులైన తండ్రి) అన్న సరళమైన పేరు పెట్టుకొన్నారు; ఇది కాక శిష్యులు ఇచ్చిన గౌరవ బిరుదులు ఇవి: మహావతార్, మహాయోగి (యోగులందరిలోకి గొప్పవారు).”
మహావతార్ బాబాజీ కుటుంబాన్ని గురించి కాని, జన్మస్థలాన్ని గురించి కాని చారిత్రక వివరాలేమీ లేనప్పటికీ, యోగానందగారు తమ ఒక యోగి ఆత్మకథలో, మరణంలేని ఈ అవతారపురుషులు భారతదేశంలోని సుదూర హిమాలయ ప్రాంతాలలో అసంఖ్యాక సంవత్సరాలుగా నివసిస్తూ, కేవలం కొద్దిమంది ధన్యులకు మాత్రమే అరుదుగా దర్శనమిస్తారని వ్రాశారు.
మృత్యుంజయులయిన ఈ మహాగురువుల దేహం మీద వయస్సును తెలిపే చిహ్నాలేవీ ఉండవు; పాతికేళ్ళకు మించని యువకుడిలా కనిపిస్తారు. పసిమిఛాయ, నడితరం పుష్టీ ఎత్తూ గల బాబాజీ సుందర దృఢకాయం దృగ్గోచరమయే తేజస్సును ప్రసరింపజేస్తూ ఉంటుంది. ఆయన కళ్ళు నల్లటివి; ప్రశాంతంగా, ప్రేమార్ద్రతతో ప్రసన్నంగా ఉంటాయి. నిగనిగలాడే ఆయన పొడుగాటి జుట్టు రాగివన్నెలో ఉంటుంది.
బాబాజీ కోరినప్పుడే ఆయన ఇతరులకు కనబడడం కాని వాళ్ళు ఆయన్ని గుర్తుపట్టడం కాని జరుగుతుంది….ప్రత్యేకించి ఈ ప్రపంచావధి పర్యంతం తమ శరీరాన్ని నిలుపుకొని ఉండటానికి భగవంతుడు నిర్ణయించిన వ్యక్తి బాబాజీ. యుగాలు వస్తుంటాయి, పోతూంటాయి — అయినప్పటికీ మరణంలేని ఈ మహాగురువులు, ప్రపంచరంగం మీద శతాబ్దాల తరబడిగా సాగుతూండే నాటకాన్ని తిలకిస్తూనే ఉంటారు.
ప్రత్యేక విధుల నిర్వహణలో ప్రవక్తలకు తోడ్పడ్డమే భారతదేశంలో బాబాజీ ధ్యేయం. ఈ విధంగా ఈయన, పవిత్ర గ్రంథాల వర్గీకరణ ప్రకారం మహావతారు లనిపించుకోడానికి అర్హులు. సన్యాసుల మఠామ్నాయాన్ని పునర్వ్యవస్థీకరించిన శంకరాచార్యులవారికీ మధ్యయుగంలో ప్రసిద్ధుడైన గురువు కబీరుకూ తామే యోగదీక్ష ఇచ్చినట్టు చెప్పారు ఈయన. పందొమ్మిదో శతాబ్దిలో ఈయన శిష్యుల్లో ప్రముఖులు, మనకు తెలిసినంతవరకు, విస్మృతమయిన క్రియాకళని పునరుజ్జీవితం చేసిన, లాహిరీ మహాశయులు.
“బాబాజీ ఆధ్యాత్మిక స్థితి మానవావగాహనకు అందనిది. మానవుల కుంచిత దృష్టి, ఈ మహాతీత నక్షత్రంలోకి చొరబారలేదు. అవతారపురుషుడి సంసిద్ధిని చిత్రించబోవడం కూడా వ్యర్థ ప్రయత్నమవుతుంది. అది అనూహ్యమైనది.”
— ఒక యోగి ఆత్మకథ లో స్వామి శ్రీయుక్తేశ్వర్
“ఎప్పుడయినా, ఎవరయినా భక్తితో బాబాజీ పేరు పలికినట్లయితే ఆ భక్తుడికి తక్షణమే ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుంది.”
— ఒక యోగి ఆత్మకథ లో లాహిరీ మహాశయులు
పరమహంసగారి ఆధ్యాత్మిక మహాకావ్యమయిన ఒక యోగి ఆత్మకథ లో, మహావతార్ బాబాజీ యొక్క ఆధ్యాత్మిక స్థితిని మరియు ప్రత్యేక పాత్రను లోతుగా వివరించే అధ్యాయాన్ని చదవమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ప్రపంచాన్ని ఉద్ధరించడానికి కృషి చేస్తూ, క్రియాయోగ మార్గంలో సాధకులకు నిరంతరం సహాయం చేస్తానని వాగ్దానం చేసిన ఈ మహనీయుల గురించి మరింతగా తెలుసుకోండి.
మహావతార్ బాబాజీ బోధనలు మరియు జీవితం గురించి మరింతగా తెలుసుకోవడానికి, ఆరు భారతీయ భాషలు – ఆంగ్లం, హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళం మరియు తెలుగు భాషల్లో – అందుబాటులో ఉన్న యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సన్యాసుల ఆన్లైన్ ప్రసంగాలను వీక్షించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.
అమర క్రియాయోగ గురుదేవులు: మహావతార్ బాబాజీ
1:07:34
1:14:14
53:59
54:07
58:58
1:07:20
క్రియాయోగ శాస్త్రం యొక్క పునరుద్ధరణ
మానవాళికి ప్రసాదించబడిన అత్యంత ప్రాచీనమైన మరియు ఆచరణాత్మకమైన దైవ సాక్షాత్కార ప్రక్రియలలో క్రియాయోగం ఒకటి. ఇది వెన్నెముకలోని జీవశక్తి (ప్రాణం)పై నేరుగా పనిచేస్తూ, సాధారణ పద్ధతులకు సాధ్యం కాని రీతిలో ఆధ్యాత్మిక పరిణామాన్ని వేగవంతం చేస్తుంది. గురుదేవులు దీనిని దైవాన్ని చేరుకునే అత్యున్నత మార్గంగా అభివర్ణించారు. మానవుల బాధలన్నింటికీ క్రియాయోగం ఒక దివ్య ఔషధం. గత యుగాలలో భగవాన్ శ్రీకృష్ణుడు గీతలోనూ, పతంజలి మహర్షి యోగ సూత్రాలలోనూ దీనిని గొప్పగా స్తుతించారు.

భగవద్గీతలో భగవంతుడు అర్జునుడితో ఇలా అన్నాడు:
“నాశరహితమైన ఈ యోగాన్ని వివస్వతుడికి (సూర్యభగవానుడికి) ఉపదేశించాను; వివస్వతుడు ఈ జ్ఞానాన్ని (హిందూ ధర్మ శాసకుడైన) మనువుకు ఉపదేశించాడు; మనువు చేత ఇది (క్షత్రియులలోని సూర్యవంశస్థాపకుడైన) ఇక్ష్వాకుడికి చెప్పబడింది. ఈ విధంగా క్రమబద్ధమైన పరంపరలో దీనిని రాజర్షులు తెలుసుకున్నారు. కానీ ఓ పరంతపా (అర్జునా)! కాలక్రమేణా ఈ యోగం భూమిపై కనుమరుగైపోయింది.” — IV:1–2
కానీ ఈ పవిత్ర శాస్త్రం కనుమరుగైంది. భౌతికవాదపు సుదీర్ఘ అంధకార యుగాలలో, ఆ ప్రక్రియని గోప్యంగా ఉంచడమో లేదా మరచిపోవడమో జరిగింది. మోక్షసాధకమైన ఈ కీలకం అనేకతరాలలోని చిత్తశుద్ధిగల అన్వేషకులకు అందకుండాపోయింది.
అప్పుడు, ఈ యుగంలో, ఒక అసాధారణమైన సంఘటన జరిగింది.
బాబాజీ ఈ ప్రక్రియను పునరుద్ధరించారు. క్రియాయోగం అందరినీ – వివాహితులను, అలాగే సన్యాసులను కూడా – చేరాలన్న ఉద్దేశంతో, ఆయన ఈ పునరుద్ధరణను ప్రారంభించడానికి ఒక గొప్ప గృహస్థ-యోగిని తన సాధనంగా ఎంచుకున్నారు.
ఆ గృహస్థ-యోగే లాహిరీ మహాశయులు.
అయినప్పటికీ ఆయనకు బాబాజీ ప్రాచీన నియమాన్ని కూడా ఆదేశించారు: “దైవాన్వేషణలో అన్నిటినీ త్యజించడానికి ప్రతిజ్ఞ పూనినవారికి మాత్రమే క్రియ ఈయబడాలి.” మూడువిధాలైన క్లేశాలకి గురౌతూ, పీడితులై, క్రియాయోగం అందకపోయినట్లయితే ముక్తిమార్గాన్ని తొక్కడానికి బహుశా ప్రయత్నమే చేయని ఈ ప్రపంచంలోని స్త్రీ పురుషుల పట్ల ప్రగాఢ కరుణతో, లాహిరీ మహాశయులు ఈ కఠినమైన షరతులను సడలించమని తమ గురుదేవులను వేడుకున్నారు – ఈ విధంగా, ఇంకా పూర్తి అంతరంగ పరిత్యాగానికి సిద్ధంగా లేకపోయినా, చిత్తశుద్ధిగల అన్వేషకులు కూడా క్రియాయోగం యొక్క ముక్తిదాయకమైన అనుగ్రహాన్ని పొందగలరు.
“అలాగే కానియ్యి,” అన్నారు బాబాజీ, “ఈశ్వరేచ్ఛ నీద్వారా వ్యక్తమయింది. వినయంగా నిన్ను సహాయమడిగే వాళ్ళందరికీ క్రియాయోగదీక్ష ఇయ్యి.”
బాబాజీ ఇంకా ఇలా చెప్పారు, “‘స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్‘ అని భగవద్గీతలో ఇచ్చిన గొప్ప హామీని నీ శిష్యుల్లో ప్రతి ఒక్కరికీ వినిపించు. [ఈ ధర్మం (ఈ ధార్మిక ప్రక్రియ) ఏ కొద్దిపాటి అయినా ఆచరణలో పెడితే, అది నిన్ను పెద్ద భయం నుంచి (మహతో భయాత్) కాపాడుతుంది – అంటే, జననమరణ చక్రపరిక్రమణలో సహజంగా ఉండే మహాక్లేశాల నుంచి కాపాడుతుంది.]”
ప్రపంచమంతటా క్రియాయోగ వ్యాప్తి
లాహిరీ మహాశయులు లౌకిక ప్రపంచంలోకి — తమ కుటుంబం, ఉద్యోగం మరియు సాధారణ జీవనశైలిలోకి తిరిగి అడుగుపెట్టారు. వారణాసిలోని తమ నివాసం నుండే ఆయన, ఎటువంటి ఆర్భాటం లేదా ప్రచారం లేకుండా, నిష్ఠగల భక్తులకు నిశ్శబ్దంగా క్రియాయోగ దీక్షను ఇవ్వడం ప్రారంభించారు. ఆయన ప్రధాన శిష్యులలో శ్రీ ప్రియనాథ్ కరార్ అనే యువకుడు ఒకరు; ఈయనే కాలక్రమేణా స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరిగా ప్రసిద్ధి చెందారు.

శ్రీయుక్తేశ్వర్ గారు, ప్రగాఢ ఆధ్యాత్మిక జ్ఞానం పొందిన ఒక సద్గురువు — పరమహంస యోగానందగారు తరువాత ఆయనను వర్ణించినట్లుగా, ఆయన ఒక “జ్ఞానావతారం”; ఆయన యొక్క తీక్షణమైన అంతర్దృష్టి మరియు కఠినమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఎందరో సాధకులను భగవంతుని వద్దకు నడిపించాయి.
అలహాబాదులో 1894లో జరిగిన కుంభమేళాలో బాబాజీని శ్రీయుక్తేశ్వర్ గారు స్వయంగా కలుసుకున్నారు. తామెవరో తెలుపకుండా బాబాజీ ఆయనతో ఇలా అన్నారు:
“తూర్పు పడమర దేశాలు, కార్యకలాపాల్నీ ఆధ్యాత్మికతనూ మేళవించిన చక్కని మధ్యేమార్గాన్ని ఏర్పరచుకోవాలి.అమెరికాలోనూ యూరప్ లోనూ, జాగృతి పొందడానికి ఎదురుచూస్తున్న భవిష్యత్ సాధువుల్ని నేను చూస్తూ ఉన్నాను. స్వామీజీ, ప్రాచ్య పాశ్చాత్య ప్రపంచాల మధ్య ముందు ముందు జరగబోయే, సామరస్యపూర్వకమైన వినిమయంలో మీరు నిర్వహించవలసిన పాత్ర ఒకటి ఉంది. మరి కొన్నేళ్ళకి, నేను మీ దగ్గరికి ఒక శిష్యుడిని పంపుతాను, పాశ్చాత్య ప్రపంచంలో యోగవిద్యావ్యాపనానికి మీరతన్ని తర్ఫీదు చెయ్యగలరు.”
ఆ శిష్యుడే ముకుందలాల్ ఘోష్. తరువాత ఆయన పరమహంస యోగానంద అయ్యారు.
ఆ విధంగా క్రియాయోగ పవిత్ర జ్యోతి మరొక్క సారి ముందుకు – శ్రీ యుక్తేశ్వర్ గారి నుంచి సముద్రాల అవతలకు దాన్ని తీసుకొని వెళ్లబోయే యువసన్యాసి వద్దకు సాగింది.
శ్రీయుక్తేశ్వర్ గారి కఠినమైన మరియు ప్రేమపూర్వకమైన పర్యవేక్షణలో పరమహంస యోగానందగారు శిక్షణ పొందారు. స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు ఆయనకు క్రియాయోగంలోనే కాకుండా, సన్యాసంలో కూడా దీక్షను అనుగ్రహించారు. గురు పరంపర ద్వారా సంక్రమించిన జ్ఞానధారను ఆయన స్వీకరించారు.
1920లో ఒకరోజున, యోగానందగారు తమ రాంచీ ఆశ్రమం మరియు పాఠశాలలో ధ్యానం చేస్తుండగా, పశ్చిమ దేశాలలో తన కార్యాచరణను ప్రారంభించడానికి ఇదే సరైన సమయమన్న అంతర్దర్శనం ఆయనకు కలిగింది. ఆయన వెంటనే కలకత్తాకు బయలుదేరారు. ఆ మరుసటి రోజే, అదే సంవత్సరం బోస్టన్లో జరగనున్న అంతర్జాతీయ మతధార్మిక మహాసభలో భారతదేశ ప్రతినిధిగా హాజరు కావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. శ్రీయుక్తేశ్వర్ గారు ఆ సమయం సరైనదేనని ధృవీకరిస్తూ ఇలా అన్నారు: “నీ కోసం తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. వెడితే ఇప్పుడే వెళ్ళాలి, లేకపోతే మరి లేదు.”
యోగానందగారు బయలుదేరడానికి కొద్దికాలం ముందు, ఈ యుగంలో ప్రాచీన క్రియాయోగ శాస్త్రాన్ని పునరుద్ధరించిన అమర గురుదేవులు మహావతార్ బాబాజీ ఆయనకు దర్శనమిచ్చారు. యోగానందగారితో బాబాజీ ఇలా అన్నారు: “పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చెయ్యడానికి నేను ఎంపిక చేసినవాడివి నువ్వే. చాలాకాలం కిందట, ఒక కుంభమేళాలో నీ గురువు యుక్తేశ్వర్ ను కలిశాను. నిన్ను ఆయన దగ్గరికి శిక్షణకు పంపుతానని అప్పుడు ఆయనకి చెప్పాను. దైవసాక్షాత్కారసిద్ధికి తోడ్పడే శాస్త్రీయ ప్రక్రియ అయిన క్రియాయోగం, చివరికి అన్ని దేశాలకీ వ్యాపించి, అనంత పరమపిత అయిన పరమేశ్వరుణ్ణి గురించి మానవుడికి కలిగే వ్యక్తిగత అతీంద్రియ దర్శనం ద్వారా, దేశాలమధ్య సామరస్యం కలిగించడానికి తోడ్పడుతుంది.”
ఆ యువ స్వామి 1920 సెప్టెంబరులో బోస్టన్ చేరుకున్నారు. క్రియాయోగం గురించి ఏమాత్రం తెలియని, భారతదేశపు ప్రాచీన విజ్ఞానంలోని ఆధ్యాత్మిక సంపదను అప్పటికింకా అర్థం చేసుకోని ఒక దేశానికి ఆయన వెళ్లారు; బాబాజీ తనకు అప్పగించిన పవిత్రమైన కార్యాన్ని నేటికీ విజయవంతంగా కొనసాగుతున్న ఒక విశ్వవ్యాప్త ఉద్యమంగా ఆయన తీర్చిదిద్దారు.
అంతర్జాతీయ మతధార్మిక ఉదారవాదుల సదస్సులో “మత విజ్ఞాన శాస్త్రం” అనే అంశంపై యోగానందగారు తన మొదటి ప్రసంగం చేశారు. దానికి అద్భుతమైన స్పందన లభించింది. అదే సంవత్సరం, భారతదేశంలో ప్రాచీన కాలం నుంచీ వస్తున్న యోగం యొక్క విజ్ఞానం మరియు తత్వజ్ఞానం, మరియు అనాదిగా పూజ్యమైన దాని ధ్యాన సంప్రదాయాలపై తమ బోధనలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి ఆయన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ను స్థాపించారు.
ప్రపంచంలో బాబాజీ కార్యాచరణను నెరవేర్చేందుకు కవల వాహకాలుగా పరమహంస యోగానందగారు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) మరియు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (ఎస్.ఆర్.ఎఫ్.) సంస్థలను స్థాపించారు. పరమహంసగారి కార్యాచరణను భారతదేశంలోను మరియు ఇరుగుపొరుగు దేశాలలోను వై.ఎస్.ఎస్. కొనసాగిస్తుంది; మిగిలిన ప్రపంచంలో ఈ కార్యాన్ని ఎస్.ఆర్.ఎఫ్. కొనసాగిస్తుంది.
పాశ్చాత్య దేశాలలో తమ కార్యకలాపాల ప్రారంభ దశ నుండే, బాబాజీ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా, క్రియా యోగ దీక్షకు సాధకులను సిద్ధం చేసేలా, యోగం యొక్క సూత్రాలు మరియు ప్రక్రియలపై ఒక క్రమబద్ధమైన శిక్షణా విధానాన్ని పరమహంసగారు రూపొందించడం ప్రారంభించారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉన్న ఏ నిజాయితీగల సాధకుడినైనా చేరుకునేలా ఏర్పరచబడిన, క్రియాయోగ ధ్యానం యొక్క శాస్త్రీయ ప్రక్రియలు మరియు సమతుల్య జీవన సూత్రాలు రెండింటినీ కలిగి ఉన్న ఒక సమగ్ర గృహ-అధ్యయన క్రమం అయిన యోగదా సత్సంగ/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పాఠాలను ఆయన రూపొందించారు.
ఈ పాఠాలు కేవలం ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా అందించే సమాచారం మాత్రమే కాదు. ఇవి గురుపరంపర యొక్క సజీవ చైతన్య ప్రకంపనలను తమలో ఇముడ్చుకుని ఉన్నాయి. బాబాజీ ద్వారా పునరుద్ధరించబడిన క్రియాయోగ ప్రక్రియ, ఎటువంటి వక్రీకరణకూ లోనుకాకుండా, యథాతథ ప్రామాణికతతో కాపాడబడుతూ, ఈ పాఠాల ద్వారా అందించబడుతుంది. తద్వారా, సాధకుడికి మరియు గురుపరంపరకూ మధ్య ప్రత్యక్షంగా, ముఖాముఖి కలవాల్సిన అవసరం లేకుండానే వీటి ద్వారా ఒక ప్రత్యక్ష, వ్యక్తిగత అనుబంధం సాధ్యమయ్యేలా మన గురుదేవులు యోగానందగారు ఏర్పాటు చేశారు.
ఈ పాఠాల ద్వారా, గురుదేవులు పరమహంస యోగానందగారు ఆత్మ విముక్తిని ప్రసాదించే క్రియాయోగ ప్రక్రియను చిత్తశుద్ధిగల ప్రతి ఆధ్యాత్మిక సాధకుడికి లభించేలా, సార్వత్రికంగా అందుబాటులోకి తెచ్చారు.
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. పాఠాలు ఒక ప్రామాణికమైన మార్గాన్ని అందిస్తాయి. ఇవి మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు, స్వామి శ్రీయుక్తేశ్వర్ మరియు పరమహంస యోగానంద — గురుపరంపర ద్వారా భద్రపరచబడి, క్రియాయోగ పవిత్ర బోధనలను అందజేస్తాయి. కేవలం ఏదో ఒక సంస్థాగతమైన హక్కుగా కాకుండా, బాబాజీ స్వయంగా నిర్దేశించిన ఆ నిర్దిష్ట మార్గం ద్వారానే ఈ బోధనలు ప్రపంచానికి అందించబడుతున్నాయి కాబట్టి ఇవి విశిష్టమైనవి.
ఒక ప్రత్యేక దివ్యసంకల్పం మేరకు, కృష్ణుడు, క్రీస్తు, మహావతార్ బాబాజీ, లాహిరీ మహాశయులు మరియు స్వామి శ్రీయుక్తేశ్వర్ ద్వారా —యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా బోధనలలో ప్రతిబింబించే కృష్ణుని మూల యోగం మరియు క్రీస్తు యొక్క మూల క్రైస్తవ ధర్మాల సమ్మేళనం ద్వారా – క్రియాయోగ విజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి నేను ఎంపిక చేయబడ్డాను.
— పరమహంస యోగానంద
ఈ ప్రపంచం దాని విభజన ధోరణులను, మత విద్వేషాలను, లౌకికవాదాన్ని విడిచిపెట్టవలసిన సమయం ఆసన్నమైందనీ, అలాగే, అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో, పురోగమిస్తున్న శాస్త్రీయ జ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానాల నేపథ్యంలో, మానవాళి కలిసి జీవించడం నేర్చుకోవాలని, లేకపోతే అది తనను తాను నాశనం చేసుకుంటుందనీ బాబాజీ ముందుగానే గ్రహించారు. క్రియాయోగాన్ని పశ్చిమ దేశాలకు పంపడం ద్వారా, ఆధ్యాత్మిక మాతృభూమి అయిన ఈ భారతదేశంలో ఎల్లప్పుడూ పోషించబడి, రక్షించబడిన సత్యసారం, చివరికి ఒక గొప్ప కాంతిపుంజంలా ప్రపంచమంతటా వ్యాపించి, క్రమంగా శాంతి, అవగాహన, ఐక్యత, సామరస్యం మరియు సోదరభావాన్ని తీసుకువస్తుంది.
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భారతదేశంలోనూ మరియు ప్రపంచవ్యాప్తంగానూ అనేక ఆశ్రమాలు, ధ్యాన కేంద్రాలు మరియు ఏకాంత ధ్యాన వాసాలను ఏర్పాటు చేసింది. ఇవి ఆధ్యాత్మిక ఆశ్రయాలుగా సేవలందిస్తూ, క్రియాయోగానికి సంబంధించిన ప్రాచీన శాస్త్రీయ ప్రక్రియలను వ్యాప్తి చేస్తూ, ఆత్మసాక్షాత్కార మార్గంలో లక్షలాది మందికి మార్గనిర్దేశం చేస్తూ ఉన్నాయి.
వై.ఎస్.ఎస్. మరియు ఎస్.ఆర్.ఎఫ్. కలిసి, 175 దేశాలలో ఉన్న భక్తులకు సేవలందిస్తున్నాయి. ప్రపంచానికి బాబాజీని తొలిసారిగా పరిచయం చేసిన పరమహంస యోగానందగారు రచించిన ఒక యోగి ఆత్మకథ గ్రంథం 50కి పైగా భాషల్లోకి అనువదించబడింది; ఈ గ్రంథం 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక గ్రంథాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. అసంఖ్యాక క్రియాయోగులు ఈ పవిత్రమైన ప్రక్రియను తమ ఇంటిలో లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. ధ్యాన కేంద్రాలు, ఆశ్రమాలలో ప్రతిరోజూ సాధన చేస్తున్నారు.
“బాబాజీ, లాహిరీ మహాశయులు మరియు నా గురుదేవులైన శ్రీయుక్తేశ్వర్ గారి ద్వారా ఈ కార్యం భారతదేశానికి, అమెరికాకు మరియు ప్రపంచానికి పంపబడింది. ఇది మొదట్లో ఒక మలయమారుతంలా ప్రారంభమై, క్రమంగా బలపడుతూ, కాలక్రమేణా అది ఒక మహాప్రచండ వాయువుగా మారి, ఈ మాయా ప్రపంచంలోని మాలిన్యాన్ని తుడిచిపెట్టి అపారమైన మేలు చేకూరుస్తుంది.”
— పరమహంస యోగానంద
మహావతార్ బాబాజీ గుహ
1861లో మహావతార్ బాబాజీ ద్వారా క్రియాయోగం పునరుద్ధరించబడటం అనేది ఆధునిక యుగపు ఆధ్యాత్మిక చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది. హిమాలయాలలోని కుమావూన్ ప్రాంతంలో, ప్రకృతి రమణీయతతో అలరారే దునగిరి పర్వతాల ఒడిలో ఉన్న ఒక చిన్న గుహలో ఈ దివ్యమైన సంఘటన జరిగింది. ఆ పవిత్ర గుహలోనే, మహావతార్ బాబాజీ తమ మహోన్నత శిష్యులైన లాహిరీ మహాశయులకు ప్రాచీన క్రియాయోగ శాస్త్రాన్ని ఉపదేశించారు. క్రియాయోగులందరూ తమ గురుపరంపరను ఈ సంఘటనతోనే ముడిపెట్టుకుంటారు.
మహావతార్ బాబాజీ మరియు లాహిరీ మహాశయుల ఆశీస్సులు ఇప్పటికీ ఈ పవిత్ర గుహలోనూ, దాని పరిసర ప్రాంతంలోనూ వ్యాపించి ఉన్నాయి.
ఈ గుహలో లాహిరీ మహాశయులు తన దివ్య గురుదేవులను మొదటిసారిగా కలుసుకుని, తన పూర్వజన్మ జ్ఞాపకాలను పునరుజ్జీవింపజేసుకున్న అద్భుతమైన కథను తెలుసుకోవడానికి, మరియు ఈ గుహ యొక్క చారిత్రక ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి, పాఠకులు ఒక యోగి ఆత్మకథలోని 34వ అధ్యాయం, “హిమాలయాల్లో మహాభవన సృష్టి” చదవాలని సూచించడమైనది.
హిమాలయాల్లో ఉన్న బాబాజీ గుహను సందర్శించాలని మీరు భావిస్తే, ద్వారాహాట్ లో ఉన్న యోగదా సత్సంగ శాఖా ఆశ్రమంను దయచేసి సంప్రదించండి.
మహావతార్ బాబాజీ నుండి ఆశీస్సు
1963–64లో మహావతార్ బాబాజీ గుహను సందర్శించినప్పుడు, ఆ మహాగురువులతో శ్రీ దయామాత (1955 నుండి 2010లో ఆమె పరమపదించే వరకు వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క మూడవ అధ్యక్షురాలు మరియు సంఘమాతగా వ్యవహరించారు) ఒక దివ్యానుభూతిని పొందారు; దీనిని ఆమె తమ ప్రేమ మాత్రమే పుస్తకంలో ఎంతో స్పష్టంగా వివరించారు. అందులోని ఒక భాగాన్ని కింద అందించడమైనది:
“…ఆ గది అంతా ఒక బంగారు కాంతితో వెలిగింది. ఆ కాంతి ఒక దేదీప్యమానమైన నీలంగా మారింది; అక్కడ మళ్ళీ మన ప్రియమైన బాబాజీ దర్శన మిచ్చారు! ఈసారి వారు ఇలా అన్నారు: “తల్లీ, ఇది తెలుసుకో: నన్ను కలుసుకోడానికి భక్తులు ఈ స్థలానికి రావలసిన అవసరం లేదు. నన్ను పిలుస్తూ, నాలో నమ్మకముంచి నన్ను గాఢంగా ధ్యానించేవాళ్లు నా సమాధానాన్ని అందుకుంటారు.’…
“అప్పుడు నేనిలా అన్నాను. ‘బాబాజీ, నా దైవమా, మేము జ్ఞానాన్ని అనుభూతి చెందాలని అనుకున్నప్పుడల్లా, జ్ఞానస్వరూపులు కాబట్టి శ్రీయుక్తేశ్వర్ గారిని ప్రార్థించాలని; ఆనందాన్ని అనుభూతి చెందాలని అనుకున్నప్పుడల్లా లాహిరీ మహాశయులతో అనుసంధానంలో ఉండాలని మా గురుదేవులు మాకు చెప్పారు. మీ తత్త్వం ఏమిటి?’ నేనిలా అనగానే, ఓహ్, నా హృదయం ప్రేమతో బ్రద్దలయిపోతుందా అనిపించింది. అది ఎటువంటి ప్రేమ! కోటానుకోట్ల ప్రేమలు కలిసి ఒక్కటైన ప్రేమ. వారంతా ప్రేమస్వరూపమే. వారి స్వభావమంతా దివ్యప్రేమే.
“మాటల్లో చెప్పనప్పటికీ ఇంతకన్న ఎక్కువ స్పష్టమైన సమాధానాన్ని నేను ఊహించలేను, అయినప్పటికీ ఈ మాటలను జోడించి వారు దాన్ని మరింత మధురంగానూ అర్థవంతంగానూ చేశారు: ‘నా స్వభావం ప్రేమ; ఎందుకంటే ప్రేమ ఒక్కటే ఈ ప్రపంచాన్ని మార్చగలదు.’”
మహావతార్ బాబాజీ గురించిన వృత్తాంతాలు (ఒక యోగి ఆత్మకథ నుండి)
పరమహంస యోగానందగారు, తమ ఒక యోగి ఆత్మకథ గ్రంథంలోని 33వ అధ్యాయంలో మహావతార్ బాబాజీ జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వృత్తాంతాలను వివరించారు. వాటిలో మూడు వృతాంతాలు కింద పునరుత్పాదించబడ్డాయి. మొదటి రెండు వృత్తాంతాలను, హిమాలయాలలో బాబాజీతో కొంతకాలం గడిపిన పరమహంస యోగానందగారి సంస్కృత గురువు అయిన స్వామి కేవలానంద వివరించారు. మూడవ వృత్తాంతాన్ని, ఒక యోగి ఆత్మకథలో “నిద్రపోని సాధువు”గా పేర్కొనబడిన శ్రీ రామగోపాల్ మజుందార్, యోగానందగారికి వివరించారు.
పరమహంసగారికి కేవలానందగారు ఇలా చెప్పారు:
“బాబాజీ జీవితంలోని ఆశ్చర్యకరమయిన సంఘటనలు రెండు తెలుసు నాకు,” అంటూ చెప్పుకొచ్చారు, కేవలానందగారు. “ఒకనాటి రాత్రి ఆయన శిష్యులు, పవిత్రమయిన వైదిక క్రతువు ఒకటి చెయ్యడానికి, భగభగా పెద్ద మంట మండుతున్న హోమకుండం చుట్టూ కూర్చుని ఉన్నారు. ఉన్నట్టుండి గురువుగారు, మండుతున్న కట్టె ఒకటి తీసుకొని, హోమకుండానికి పక్కనే ఉన్న ఒక శిష్యుడి భుజంమీద కొట్టారు.
“‘స్వామీ ఎంత క్రూరం!’ అన్నారు ఆక్షేపణగా, అక్కడే ఉన్న లాహిరీ మహాశయులు.
“‘అయితే ఇతను, తన పూర్వకర్మ ఫలానుసారంగా నీ కళ్ళముందే కాలి బూడిద అయిపోతూంటే చూస్తూంటావా?’
“ఈ మాటలతో బాబాజీ, శిష్యుడి వికృత భుజంమీద ఉపశమన దాయకమయిన తమ చెయ్యి వేశారు. ‘ఈ రాత్రి నిన్ను బాధాకరమయిన మృత్యువునుంచి తప్పించాను. నిప్పుసెగవల్ల ఈ కొద్దిపాటి బాధతో కర్మనియమం నెరవేరింది’ అన్నారాయన.”
“మరో సందర్భంలో బాబాజీ పవిత్ర బృందం దగ్గరికి ఒక ఆగంతకుడు రావడంవల్ల ప్రశాంతతకు భంగం కలిగింది. గురుదేవులు బసచేసిన చోటికి దగ్గరగా, చేరడానికి దాదాపు అశక్యమయిన కొండ కొనకొమ్ముకు ఆశ్చర్యం కలిగించేటంత నేర్పుతో అతడు ఎక్కి వచ్చాడు.
“‘స్వామీ, బాబాజీ అనే మహానుభావులు మీరే అయి ఉండాలి,’ ఆ వ్యక్తి ముఖంలో మాటలకందని భక్తిప్రపత్తులు వెలుగొందాయి. ‘మీకోసం, చేరరాని ఈ కోసుగుట్టల్లో నెలలు తరబడిగా అంతులేకుండా వెతుకుతున్నాను. నన్ను తమ శిష్యుడిగా స్వీకరించమని వేడుకొంటున్నాను,’ అన్నాడు.’
“మహాగురువులు మారు పలకకపోయేసరికి అతడు, కొండకొమ్ముకు దిగువనున్న బండల వరసవేపు చూపించాడు. ‘మీరు నన్ను స్వీకరించని పక్షంలో ఈ కొండమీంచి దూకేస్తాను. దైవాన్వేషణలో నేను మీ గురుత్వం పొందలేక పోయినట్లయితే నా జీవితం నిరర్థకం.’
“‘అయితే దూకు,’ అన్నారు బాబాజీ, ఏ మాత్రం ఉద్రేకం లేకుండా. ‘నీ ప్రస్తుత పరిస్థితిలో నిన్ను నేను స్వీకరించలేను.’
“వెంటనే ఆ మనిషి కొండమీంచి దూకేశాడు. అది చూసి శిష్యులు కొయ్యబారి పోయారు. బాబాజీ వాళ్ళవేపు చూసి, ఆ ఆగంతకుడి కాయాన్ని తీసుకురమ్మని చెప్పారు. చితికిన కాయాన్ని తెచ్చి శిష్యులు ఎదురుగా పెట్టగానే మహాగురువులు, దానిమీద తమ చెయ్యి వేశారు. వెంటనే, చనిపోయినవాడు కళ్ళు విప్పి సర్వశక్తిమంతులయిన గురుదేవుల ముందు సవినయంగా సాష్టాంగ దండప్రణామం చేశాడు.
“‘ఇప్పుడు పనికొస్తావు నువ్వు, శిష్యరికానికి,’ అంటూ బాబాజీ, మళ్ళీ బతికిన శిష్యుడివేపు ఆప్యాయంగా చూశారు. ‘కఠినమయిన పరీక్షను ధైర్యంగా ఎదుర్కొని కృతార్థుడివయావు నువ్వు. చావన్నది మరి మళ్ళీ తాకదు నిన్ను; నువ్విప్ప్పుడు మా అమరబృ౦దంలో ఒకడివి,’ అన్నారు. ఆ తరవాత, అలవాటు ప్రకారం, ‘డేరా డండా ఉఠావో’ అంటూ బయలుదేరమన్నారు. మరుక్షణంలో వారి బృ౦దమంతా కొండమీంచి మాయమయింది.”
రణబాజ్ పూర్ లో, “నిద్రపోని సాధువు” అయిన రామగోపాల్ మజుందార్ గారిని సందర్శించిన సందర్భంలో ఆయన, బాబాజీని తాము మొట్టమొదటిసారి కలుసుకోడానికి సంబంధించిన అద్భుత కథ ఇలా చెప్పారు.
“కాశీలో లాహిరీ మహశయుల పాదసన్నిధిలో కూర్చోడంకోసం ఒక్కొక్కప్పుడు నేను, ఏకాంతగుహను విడిచి వస్తూ ఉండేవాణ్ణి,” అన్నారు రామగోపాల్ గారు నాతో. “ఒకనాడు నడిరాత్రివేళ వారి శిష్యబృ౦దంతోబాటు కూర్చుని ధ్యానం చేసుకొంటూ ఉండగా గురుదేవులు ఆశ్చర్యకరమయిన కోరిక ఒకటి కోరారు.
“‘రామగోపాల్’, వెంటనే నువ్వు దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళు, ‘అన్నారు లాహిరీ మహాశయులు.’
“వెంటనే నేను ఆ ఏకాంత ప్రదేశానికి వెళ్ళాను. ఆ రాత్రివేళ, వెన్నెలతోను మిలమిల మెరిసే చుక్కలతోను ప్రకాశిస్తున్నది. కొంతసేపు ఓపికగా, మౌనంగా కూర్చున్నాను. ఇంతలో నా పాదాలకు దగ్గరిలోనే ఉన్న ఒక పెద్ద రాతిపలకమీద నా చూపు నిలిచింది. అది మెల్లమెల్లగా లేచినప్పుడు, దానికింద భూమిలో ఒక గుహ ఉన్నట్టు వెల్లడి అయింది. ఏ అజ్ఞాత సాధనంవల్లనో పైకి లేచిన రాయి కదలడం మానేసిన తరవాత, ఆశ్చర్యం కలిగించేటంత అందమయిన ఒక యువతి ఆచ్ఛాదిత రూపం, ఆ గుహలో౦చి బయటికి వెలువడి గాలిలో తేలింది. చుట్టూ మృదువయిన కాంతిపరివేషం గోచరిస్తూ ఉండగా ఆమె, మెల్లగా నేలకు దిగి వచ్చి ఒకానొక పారవశ్యంలో మునిగి ఉండి నా ముందు నిశ్చలంగా నిలిచారు. చివరికామె కదిలి మెల్లగా ఇలా అన్నారు.
“‘నేను మాతాజీని – బాబాజీ చెల్లెల్ని, ఈ రాత్రి గొప్ప ప్రాముఖ్యం గల ఒక విషయాన్ని చర్చించడానికి ఆయన్నీ లాహిరీ మహాశయుల్నీ నా గుహ దగ్గరికి రమ్మని కోరాను.’
“ఇంతలో, వెండిమబ్బును పోలిన కాంతిపుంజం ఒకటి గంగానదిమీద త్వరితగతిన తేలుతూ వస్తున్నట్టు కనిపించింది. పారదర్శకం కాని నీళ్ళమీద దాని అద్భుత ప్రభ ప్రతిఫలిస్తో౦ది. అది దగ్గరికి వచ్చి కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపుతో మాతాజీ సరసన నిలిచి వెంటనే లాహిరీ మహాశయుల మానవ రూపాన్ని ధరించింది. ఆ మహాయోగిని పాదాలకు వినమ్రులయి నమస్కరించారాయన.
“నేను దిగ్భ్రమనుంచి ఇంకా తేరుకోకముందే ఆకాశంలో పరిభ్రమిస్తూ వస్తున్న ఒక అలౌకిక తేజోబింబాన్ని చూసి మరింత ఆశ్చర్యపోయాను. వడివడిగా దిగుతూ ఆ తేజోవాలయం, మా సమూహానికి దగ్గరిగా వచ్చి ఒక అందమయిన యువకుడిలా ఆకృతి దాల్చింది. ఆయన బాబాజీ అని నాకు తక్షణమే అర్థమయింది. ఆయన లాహిరీ మహాశయుల్ని పోలి ఉన్నారు; అయితే తమ శిష్యుడికంటె చాలా వయసు తక్కువ వారిగా ఉన్నారు; నిగనిగలాడే పొడవైన జుట్టు వారిది.
“లాహిరీ మహాశయులూ మాతాజీ నేనూ మహాగురువుల పాదాలకు ప్రణామం చేశాం. ఆయన దివ్యశరీరాన్ని తాకేసరికి నాలోని అణువణువూ పరమానందానుభూతితో పరవశమయింది.
“పావనమైన సోదరీ, నేను నా రూపాన్ని విడిచి అనంత దైవవాహినిలోకి దూకుదామనుకుంటున్నాను, ‘అన్నారు బాబాజీ.’
“‘ప్రియ గురుదేవా, మీ ఆలోచన నేను ముందే తెలుసుకున్నాను. ఆ విషయమే ఈ రాత్రి మీతో మాట్లాడాలనుకున్నాను. మీరు శరీరాన్ని ఎందుకు విడవాలి?’ ఆ మహితాత్మురాలు ఆయనవైపు ప్రార్థనాపూర్వకంగా చూశారు.
“’నా ఆత్మసాగరంమీద నేను, కంటికి కనిపించే అలరూపాన్ని ధరిస్తే నేమి, కనిపించని అలరూపాన్ని ధరిస్తే నేమి? తేడా ఏముంటుంది?’
“వెంటనే మాతాజీ, ‘అమర గురుదేవా, అటువంటి తేడా ఏమీ లేనప్పుడు మీ రూపాన్ని ఎన్నటికీ విడవకండి,’ అన్నారు ఛలోక్తిగా.’
“‘తథాస్తు,’ అన్నారు బాబాజీ, గంభీరంగా. ‘నా భౌతిక శరీరాన్ని ఎన్నటికీ విడవను. ఇది భూమి మీద కనీసం కొద్దిమందికి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. భగవంతుడు తన ఆకాంక్షను నీ నోటిమీదగా చెప్పించాడు.’
“ఆ మహానుభావుల సంభాషణను భయభక్తులతో వింటూ ఉండగా పరమ గురుదేవులు, ప్రసన్నంగా నావేపు తిరిగారు.
“’భయపడకు రామగోపాల్, ఈ అమర వాగ్దాన ఘట్టానికి నువ్వొక సాక్షిగా ఉండి ధన్యుడివయావు,’ అన్నారాయన.
“బాబాజీ మృదుమధురస్వరం ఆగిపోతూ ఉండగా ఆయన రూపమూ లాహిరీ మహాశయుల రూపమూ మెల్లగా పైకి గాలిలో తేలి వెనక్కి గంగానదివేపు కదిలాయి. ఆ రాత్రిపూట ఆకాశంలో వారు అదృశ్యులవుతూ ఉండగా, వారి దేహాల చుట్టు కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిపుంజం వెలుగొందింది. మాతాజీ రూపం గుహ దగ్గరికి తేలుతూ సాగి గుహలోకి దిగింది. రాతిపలక మళ్ళీ, కిందికి వచ్చి, కంటికి కనిపించని చేతులు కదిల్చినట్లుగా కదిలి ఆ గుహను మూసేసింది.
“అనంతమైన ఉత్తేజం పొంది నేను తిరిగి లాహిరీ మహాశయుల నివాసానికి దారి తీశాను.”
మహావతార్ బాబాజీ స్మృతి దినోత్సవం
మహావతార్ బాబాజీ మరియు పరమహంస యోగానందగారి మధ్య జరిగిన పవిత్ర సమావేశానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 25వ తేదీని మహావతార్ బాబాజీ స్మృతి దినోత్సవంగా జరుపుకుంటారు; ఆ సమావేశంలోనే బాబాజీ, క్రియాయోగ బోధనలను ప్రపంచమంతటా వ్యాప్తి చేసే బాధ్యతను పరమహంసగారికి అప్పగించారు.
ఈ పవిత్ర దినోత్సవానికి గుర్తుగా వై.ఎస్.ఎస్. ఆశ్రమాలు మరియు కేంద్రాలు ఒక ప్రత్యేక స్మారకోత్సవం (ఇందులో నియమిత సమయంపాటు ధ్యానం, స్ఫూర్తిదాయక పఠనం, మరియు భక్తిగీతాలాపన ఉంటాయి) నిర్వహిస్తాయి. భక్తులు ఆన్లైన్ లో పాల్గొనేందుకు వై.ఎస్.ఎస్. ఆశ్రమాల్లోని ఒక ఆశ్రమం నుండి ఇది ప్రత్యక్ష-ప్రసారం చేయబడుతుంది.

















