యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా శతాబ్ది ఉత్సవం

30 డిసెంబర్, 2016

ప్రియుతములారా,

మన ప్రియతమ గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా స్థాపనను స్మరించుకుంటూ ఈ పవిత్ర శతాబ్ది సంవత్సరాన్ని మనం కలిసి జరుపుకుంటున్నందున నా హృదయం ఆనందిస్తోంది. నేను మీ అందరికీ ప్రేమపూర్వక శుభాకాంక్షలు మరియు దివ్య ఆశీర్వాదాలను పంపిస్తున్నాను మరియు గౌరవనీయమైన మన గురుదేవులను గౌరవించడానికి మరియు భారతదేశానికి, ప్రపంచానికి ఆయన చేసిన కృషిని గౌరవించటానికి చాలా ప్రేమ మరియు శ్రద్ధతో ప్రణాళిక చేయబడిన మరియు సిద్ధం చేయబడిన అనేక అందమైన కార్యక్రమాలను దగ్గరగా అనుసరిస్తూ మీ ఆత్మతో చేరుతాను. గురుదేవుల యోగదా సత్సంగ సొసైటీ, దిహికాలోని బాలుర కోసం ఏర్పాటు చేయబడిన ఒక చిన్న “జీవించడం ఎలా” పాఠశాల నుండి, పెద్ద ఆశ్రమాలు, చైతన్యవంతమైన మరియు పెరుగుతున్న సన్యాసుల క్రమం మరియు భారతదేశమంతటా రెండు వందలకు పైగా ధ్యాన కేంద్రాలను కలిగి – అలాగే అనేక విద్యా సంస్థలు మరియు ధార్మిక సేవా సంస్థగా ఎలా ఎదిగిందోనని నేను ఆలోచించినప్పుడు – ఆయన అద్భుతమైన ఆనందాన్ని నేను అనుభవిస్తాను. ఈ ఉల్లాసకరమైన వార్షికోత్సవం సందర్భంగా ఆయన భక్తులందరికీ – నిజానికి, యావత్ భారతదేశానికి – తన దివ్యప్రేమను మరియు ఆశీర్వాదాలను కురిపిస్తున్నారని తెలుసుకోండి మరియు ఈ ఎదుగుదలకు దోహదపడిన ప్రతి ఒక్కరికీ అపరిమితమైన ఆత్మపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

వై‌.ఎస్‌.ఎస్. యొక్క వినయపూర్వకమైన ప్రారంభం నుండి గడిచిన వంద సంవత్సరాలలో గురుదేవులు, భారతదేశం మరియు పాశ్చాత్య దేశాలచే దివ్య ప్రేమ యొక్క నిజమైన అవతారంగా గుర్తించబడ్డారు – ప్రపంచాన్ని మార్చే లక్ష్యం కోసం జన్మించిన యుగ ప్రవర్తక జగద్గురువు. మన ఆత్మ పురోగతిని మరియు మానవాళి యొక్క ఉన్నత పరిణామాన్ని వేగవంతం చేయడం కోసం ఆధునిక యుగానికి ప్రత్యేకమైన క్రియాయోగ పవిత్ర శాస్త్రాన్ని వ్యాప్తి చేయడమే ఆయనకు దేవుడు నియమించిన పని. తన మొదటి “జీవించడం ఎలా” పాఠశాలను స్థాపించిన మూడు సంవత్సరాల తర్వాత, ఈ ముఖ్యమైన పనిని చేపట్టడానికి ఆయన అమెరికాకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైందని, రాంచీలో గురుదేవులకు కలిగిన అంతర్దర్శనం వెల్లడించింది. ఆ తర్వాత ఆయన పాశ్చాత్య దేశాల్లో జీవించాలని నిర్ణయించబడినప్పటికీ, భారతదేశం మాత్రం ఎప్పుడూ ఆయన స్పృహలో మరియు హృదయంలో ఉండేది. తన కవిత, మై ఇండియాలో, ఆయన ఇలా వ్రాశారు: “నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను ఎందుకంటే అక్కడ నేను మొదట దేవుణ్ణి ప్రేమించడం మరియు అందమైన వాటినన్నిటినీ ప్రేమించడం నేర్చుకున్నాను.” భారతదేశంలో ఆయన తన కార్యాన్ని ప్రారంభించారు మరియు తన ప్రియమైన మాతృభూమికి నివాళులర్పించే మాటలతో ఆయన తన మర్త్య రూపాన్ని విడిచిపెట్టారు – మరియు ఆయన ఆత్మ మరియు భారతదేశం స్ఫూర్తినిచ్చిన కార్యం ఎప్పటికీ జీవించి ఉంటాయి.

పశ్చిమ దేశాలలో తన కార్యాన్ని నెరవేర్చడంలో గురుదేవులకు లెక్కలేనన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ, భారతదేశంలోని వై‌.ఎస్‌.ఎస్. మరియు ఆయన శిష్యుల సంక్షేమం పట్ల ఆయన ప్రేమపూర్వక శ్రద్ధలో మార్పులేదు. 1935-36లో, దేవుడు ఆయనకు భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశాన్ని ఇచ్చినప్పుడు, ఆయన దేశవ్యాప్తంగా ఉపన్యాసాలు ఇచ్చారు మరియు వై‌.ఎస్‌.ఎస్. భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మరియు భద్రంగా ఉంచడం కోసం ఆయన చేయగలిగినదంతా చేశారు. మళ్ళీ భారతదేశానికి తిరిగి రావాలని తన ఆశను వ్యక్తం చేయడం నేను చాలాసార్లు విన్నాను. కానీ, ఇది జగన్మాత సంకల్పం కాదని తన జీవిత చరమాంకలో ఆయన తెలుసుకోగానే, శ్రీ శ్రీ దయామాతగారికి అక్కడ తన పనులను చూసుకునే బాధ్యతను అప్పగించారు. ఆమె పూర్ణ హృదయంతో ఆ పవిత్రమైన నమ్మకాన్ని నెరవేర్చారు, భక్తులకు సర్వ-ప్రేమగల జగన్మాత యొక్క నిజమైన ప్రతిబింబంగా మార్పు చెందారు మరియు ఆమె చైతన్యం గురుదేవులతో పూర్తి స్థాయిలో అనుసంధానం పొంది ఉండడం వారిని ప్రేరేపించింది. ఆ మహోన్నతమైన క్షేత్రము నుండే ఆమె యాభై ఏళ్లకు పైగా గురుదేవుల ఆశయాలు మరియు ఆదర్శాలకు అనుగుణంగా వై.ఎస్‌.ఎస్‌. కార్యానికి మార్గనిర్దేశం చేసి, ఈ రోజు మనం చూస్తున్నట్లుగా సంస్థను అభివృద్ధి చేశారు. హంస స్వామి శ్యామానంద, ఆమెకు అందించిన అమూల్యమైన సహాయం మరియు మద్దతుకు మేము కృతజ్ఞులం, ఆమె ప్రయత్నాలలో ఆయన అంకితభావం కీలక పాత్ర పోషించింది మరియు నిష్టగల అనేకమంది వై‌.ఎస్‌.ఎస్. భక్తులు కూడా తమ సహకారాన్ని అందించారు – పేర్లు చెప్పడానికి చాలా మంది ఉన్నారు, కానీ వారు మా హృదయాలలో ప్రతిష్టించబడ్డారు.

దయామాతగారి అనేక భారతదేశ పర్యటనలకు ఆమెతో పాటు వెళ్ళడం నా అదృష్టం. భారతదేశపు ప్రత్యేక వారసత్వమైన, దేవుని పట్ల స్వచ్ఛమైన, హృదయపూర్వకమైన భక్తిని ఆమె కలిగి ఉండడం నా స్మృతులలో నిక్షిప్తం చేసుకున్నాను. మేము కలుసుకున్న అద్భుతమైన వై.ఎస్.ఎస్. భక్తులలో అది ప్రతిబింబించింది, ఆ సందర్శనలు మరియు తరువాత గురుదేవుల స్వదేశానికి చేసిన ఇతర పర్యటనలు, నా అత్యంత ఐశ్వర్యవంతమైన జ్ఞాపకాలలో నా హృదయం మరియు మనస్సుపై శాశ్వతంగా చెక్కబడి ఉన్నాయి. నేను వాటిని తరచుగా జీవిస్తాను మరియు అక్కడ ఉన్న గురుదేవుల శిష్యుల కోసం, యోగదా సత్సంగ సొసైటీ యొక్క పని కోసం మరియు ఆయన కార్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో చేస్తున్న వారందరికీ నేను గాఢమైన ప్రార్థనలను పంపని రోజు ఉండదు. నేను వై‌.ఎస్‌.ఎస్. కార్యక్రమాల ఛాయాచిత్రాలను చూసినప్పుడు, ఆయన బోధనలను పూర్ణముగా ఆచరించడంలో చాలా ఉత్సాహంగా ఉండే అందమైన ఆత్మల సమూహాలను – అందరితో కలిసి క్రమం తప్పకుండా ధ్యానించేవారు, ఆయన జ్ఞానాన్ని గ్రహించేవారు మరియు లెక్కలేనన్ని మార్గాల్లో ఆనందంగా ఆయన కార్యానికి సేవ చేసే వారిని చూసి నేను పులకించిపోయాను. కొంతమంది భక్తులతో మొదలై భగవంతుడు మరియు గురుదేవుల ప్రేమలో ఐక్యమైన ఆధ్యాత్మిక కుటుంబంగా విస్తరించింది.

గురుదేవులు మన మధ్య ఉన్న రోజులలో ఉన్నట్లే ఇప్పుడు కూడా తన శిష్యుల సంక్షేమం మరియు పురోగతి పట్ల ఆసక్తిని కలిగి ఉన్నారు మరియు మీలో ప్రతి ఒక్కరు ఆయన ధ్యాన ప్రక్రియలను శ్రద్ధగా ఆచరిస్తూ ఎలా పురోగమిస్తున్నారో మరియు మీ జీవితాలను జగన్మాతను సంతోషపెట్టడంలో ఎలా గడుపుతున్నారో చూడటం ఆయనకు చాలా సంతోషాన్నిస్తుంది. మీరు ఆధ్యాత్మిక అవగాహనలో ఎదగడం మరియు దేవునితో మరింత గాఢమైన మరియు మధురమైన అంతర్గత సంబంధాన్ని అభివృద్ధి చేసుకోవడం చూసినప్పుడు ఆయన సంతోషిస్తారు, ఎందుకంటే ఆయన మీ కోసం అత్యున్నతమైనదాన్ని కోరుకుంటున్నారు. 100 సంవత్సరాల క్రితం ఆయన నెలకొల్పిన దైవప్రేమ మరియు సేవల దివ్య ఆదర్శాలను ఎక్కువగా ప్రతిబింబించే భక్తుడిగా మార్పు చెందడమే ఈ కార్యాన్ని ఆయనకు అందించే అత్యున్నత నివాళి.

పరమహంసగారి సందేశం చాలా మంది జీవితాలను స్పృశించింది, ఎందుకంటే ఆయన ఆత్మ యొక్క ఏకీకృత భాష – దివ్య ప్రేమ మరియు సత్యం యొక్క శాశ్వతమైన భాషలో సంభాషిస్తారు. ఆయన బోధనలు మరియు దేవుని పట్ల ఆయన గొప్ప ప్రేమకున్న ఆకర్షణశక్తి, సాంస్కృతిక, కుల, జాతీయ మరియు మతపరమైన తేడాల అడ్డంకులను అధిగమిస్తాయి. వై‌.ఎస్‌.ఎస్./ఎస్‌.ఆర్‌.ఎఫ్. ప్రభావం సున్నితమైన పిల్లగాలిగా ప్రారంభమవుతుందని మరియు క్రమంగా దేవుని బిడ్డల జీవితాలలోని చీకటిని తుడిచివేయడానికి సహాయపడే బలమైన వాయువుగా మారుతుందని గురుదేవులు మనకు చెప్పారు. ఈ శతాబ్ది సంవత్సరంలో మనం ప్రారంభాలను మాత్రమే కాకుండా మంచి కోసం ఆ శక్తి పెరుగుదలను వేడుకగా జరుపుకుంటాము; మరియు రాబోయే శతాబ్దానికి దాని ఆధ్యాత్మిక ప్రభావాలు మరింత వేగవంతముగా అందేటట్లు ఉద్దేశించబడ్డాయి. గురుదేవులు తన వై‌.ఎస్‌.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సంస్థను తూర్పు మరియు పడమరల ఐక్యత అనే తన ఆదర్శాన్ని, ఆయన ప్రేమ మరియు వివేకానికి శాశ్వతమైన, స్వచ్ఛమైన మాధ్యమంగా ఉండాలని స్థాపించారు మరియు ఆ పవిత్ర వారసత్వం చుట్టూ మీ జీవితాలను నిర్మించుకునే మీ అందరి ప్రయత్నాలను ఆయన ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆ ప్రయత్నాలు తీసుకువచ్చే అంతర్గత పరివర్తన, మరియు మీ ముఖాల్లో నేను చూసిన సంతోషకరమైన ఉత్సాహం, ఈ దివ్య బోధనల సజీవ శక్తికి గొప్ప సాక్ష్యాలుగా నిలుస్తాయి; మరియు రాబోయే సంవత్సరాల్లో ఆయన కార్యాన్ని శక్తివంతం చేస్తూనే ఉంటాయి. జై గురు!

దేవుడు మరియు గురుదేవుల ఎడతెగని ఆశీస్సులలో,

శ్రీ శ్రీ మృణాళినీమాత

ఇతరులతో పంచుకోండి