కోల్‌కతాలో జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా పరమహంస యోగానంద గారిని గౌరవించారు

28 జూన్, 2026

కోల్‌కతాలో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పరమహంస యోగానంద గారి వారసత్వాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రముఖంగా ప్రస్తావించింది

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి (దీనిని జూన్ 21న జరుపుకుంటారు) ముందు రోజుల్లో, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మన పూజ్య గురుదేవులు మరియు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) వ్యవస్థాపకులైన శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మరియు ఇతర ఆధ్యాత్మిక ప్రముఖులను కలకత్తా నగరమంతటా ఏర్పాటు చేసిన ప్రత్యేక చిత్రాలతో గౌరవించింది.

యోగానంద గారికి మరియు ఇతర ఆధ్యాత్మిక దిగ్గజాలకు నగర వ్యాప్తంగా నివాళి అర్పించారు

బెంగాల్ యొక్క గొప్ప ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా కీర్తిస్తూ, కోల్‌కతా అంతటా ప్రభుత్వ బ్యానర్లను ప్రదర్శించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహామేధావులు మరియు యోగులైన స్వామి వివేకానంద, శ్రీ అరబిందో, శ్రీ రవీంద్రనాథ్ టాగూర్, శ్రీ బంకిం చంద్ర చటోపాధ్యాయలతో పాటు పరమహంస గారిని గౌరవించారు.

అద్భుతమైన వేడుకలు: ఇసుక కళ మరియు డ్రోన్ ప్రదర్శనలు

కేవలం బ్యానర్లకే పరిమితం కాని ఈ నివాళులు, అద్భుతమైన బహిరంగ ప్రదర్శనల ద్వారా వేలాది మంది పౌరుల మనస్సులను ఆకట్టుకున్నాయి. మిలీనియం పార్క్‌లోని హుగ్లీ నది ఒడ్డున ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన, క్లిష్టమైన ఇసుక కళా ప్రదర్శన, నివాళులర్పించడానికి గుమికూడిన జన సమూహాలను ఆకర్షించింది. జూన్ 21న, ఒక అద్భుతమైన, సమకాలీకరించిన డ్రోన్ ప్రదర్శనతో రాత్రి ఆకాశం జీవం పోసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న యోగా మరియు ధ్యానం యొక్క ప్రకాశానికి ప్రతీకగా, వేలాది కాంతివంతమైన డ్రోన్‌లు నీటిపై మిరుమిట్లు గొలిపే నమూనాలను ఏర్పరిచాయి.

ఆధునిక కాలంలోని కొందరు గొప్ప మేధావులు మరియు యోగులతో పాటు పరమహంస యోగానంద గారిని గౌరవిస్తూ రూపొందించిన ఒక అందమైన ఇసుక కళ.
“ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా” అనే అంశాన్ని ప్రచారం చేసే బ్యానర్.

ఇలాంటి సంఘటనల వల్ల, యోగా కేవలం ఒక శారీరక క్రమశిక్షణ మాత్రమే కాదనీ, సమస్త మానవాళికి అంతర్గత శాంతిని చేకూర్చే అత్యున్నతమైన, అత్యంత నిశ్చయాత్మకమైన మార్గమనే పరమహంసగారి దృక్పథం అత్యున్నత స్థాయిలలో గుర్తింపు పొందుతూనే ఉంది.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోల్‌కతా మరియు శ్రీరాంపూర్ లో వై.ఎస్.ఎస్. ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది

2026, జూన్ 21న, భారీ వర్షాలు మరియు మేఘావృతమైన ఆకాశం ఉన్నప్పటికీ, కోల్‌కతా మరియు దాని పరిసర ప్రాంతాల్లోని రెండు వేదికలైన దక్షిణేశ్వర్‌లోని యోగదా సత్సంగ మఠం మరియు శ్రీరాంపూర్ లోని స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి స్మృతి మందిరంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలలో పాల్గొనడానికి వందలాది మంది సత్యాన్వేషకులు, యోగా ఔత్సాహికులు మరియు వై.ఎస్.ఎస్. భక్తులు తరలి వచ్చారు.

దక్షిణేశ్వర్

జూన్ 21న దక్షిణేశ్వర్‌ లోని యోగదా సత్సంగ మఠంలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నవారికి, ఒక వై.ఎస్.ఎస్. సన్యాసి క్రియాయోగ శాస్త్రం యొక్క చరిత్రను, ఆధునిక ప్రాముఖ్యతను పరిచయం చేశారు. ఈ పవిత్ర శాస్త్రం ఆధునిక ఒత్తిడి మరియు ఆందోళనలకు విరుగుడుగా ఎలా పని చేస్తుందో, శరీరం, మనస్సు మరియు ఆత్మను ఎలా సమన్వయం చేస్తుందో, మరియు ఉద్రిక్తత, ఆందోళనలను తొలగించడానికి ఒక ఆచరణాత్మక మార్గాన్ని ఎలా అందిస్తుందో ఆయన నొక్కి చెప్పారు. ఈ క్రియాయోగ ప్రక్రియను క్రమం తప్పకుండా అభ్యసించడం ద్వారా లోతైన అంతర్గత ప్రశాంతత లభిస్తుందని, శ్వాస మరియు మనస్సు రెండూ ప్రశాంతత చెంది ఆనందమయమైన భగవదనుభూతి మేల్కొంటుందని కూడా ఆయన వివరించారు. హాజరైనవారికి సరైన ఆసన సాధన, ప్రాథమిక శ్వాసాభ్యాసాలు, మానసిక చిత్రణ మరియు దివ్యసంకల్పాలతో కూడిన ఒక ప్రాథమిక ధ్యానాన్ని నిర్దేశించారు.

వై.ఎస్.ఎస్. దక్షిణేశ్వర్‌ ఆశ్రమంలో నిర్వహించిన కార్యక్రమం.

శ్రీరాంపూర్

శ్రీరాంపూర్ లోని యోగదా సత్సంగ ధ్యాన కేంద్రం నిర్వహించిన ఒక కార్యక్రమంలో, స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి స్మృతి మందిరం ఆవరణలో సుమారు 215 మంది స్థానిక నివాసితులు సమావేశమయ్యారు.

బాలల సత్సంగ బృందం యొక్క ఉపాధ్యాయులు ఆలపించిన ఒక అందమైన ప్రారంభ గీతంతో కార్యక్రమం ప్రారంభయమయ్యింది. యోగాసనాల సామరస్యం, క్రమశిక్షణ మరియు కళాత్మక సౌందర్యాన్ని పరిపూర్ణంగా ప్రదర్శించిన సమకాలీన యోగా ప్రదర్శనను హాజరైనవారు వీక్షించారు.

వై.ఎస్.ఎస్. సన్యాసి స్వామి అచ్యుతానంద గిరి అంతర్గత శాంతిపై స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. అందులో ఆయన, మానసిక స్పష్టత మరియు సంపూర్ణ శ్రేయస్సును సాధించడంలో ప్రార్థన మరియు ధ్యాన పద్ధతుల యొక్క కీలక పాత్రను వివరించే, ఒక ఆలోచనాత్మక వివరణను అందించారు.

శ్రీరాంపూర్ కేంద్రంలో ధ్యాన ప్రక్రియలపై ఒక జ్ఞానదాయకమైన సమావేశాన్ని నిర్వహించిన స్వామి అచ్యుతానంద గిరి.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ కార్మిక, ప్రజారోగ్య మరియు ఇంజనీరింగ్ (PHE) శాఖల రాష్ట్ర మంత్రి శ్రీ భాస్కర్ భట్టాచార్య గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి వై.ఎస్.ఎస్. సత్కరించింది.

గాఢమైన ఆధ్యాత్మిక వాతావరణానికి చలించిపోయిన మంత్రి గారు, తాను వక్తగా కాకుండా ప్రధానంగా శ్రోతగా వచ్చానని, ఆ సాయంత్రం జరిగిన ప్రసంగాల వల్ల తాను ఎంతగానో ప్రయోజనం పొంది, స్ఫూర్తి పొందినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం స్థానిక సమాజానికి యోగ ధ్యానం యొక్క శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను అనుభవించడానికి, దాని ఆచరణాత్మక ప్రాముఖ్యతను నిరూపించడానికి మరియు గురుదేవుని బోధనల యొక్క శాశ్వత సారాన్ని బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన అవకాశంగా ఉపయోగపడింది.

మాతో కలిసి అంతర్గత శాంతిని అనుభవించండి

అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు బహుళ భాషలలో వీక్షించడానికి అందుబాటులో ఉన్నాయి

క్రియాయోగ ధ్యానం యొక్క బోధనలు వాటి ప్రగాఢమైన ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న తరుణంలో, అంతర్గత సామరస్యం వైపు మీ వంతు అడుగు వేయమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

మీరు అంతర్గత శాంతిని అనుభవించాలనుకుంటే, శాస్త్రీయ ధ్యాన పద్ధతులను నేర్చుకోవాలనుకుంటే, మరియు వై.ఎస్.ఎస్. సన్యాసులచే నడిపించబడే మార్గదర్శక ధ్యానాలను అభ్యసించాలనుకుంటే, వై.ఎస్.ఎస్. నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను వీక్షించవలసిందిగా మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.

మన హృదయాలలో శాంతిని, ప్రపంచంలో సామరస్యాన్ని తీసుకురావడానికి యోగ స్ఫూర్తితో ఏకమవుదాం.

ఇతరులతో పంచుకోండి