ఎడతెరిపి లేకుండా ధ్యానం చెయ్యి. ఏ విధమైన క్లేశమూ లేని అనంతత్త్వంగా నిన్ను నీవు తొందరగానే చూసుకుంటావు. శరీరానికి బంధీవై ఉండడం మానెయ్యి. క్రియాయోగమనే రహస్య కీలకాన్ని ఉపయోగించి, శరీరం నుంచి తప్పించుకొని పరమాత్మ సన్నిధిలోకి పారిపోవడం నేర్చుకో.
— లాహిరీ మహాశయులు, ఒక యోగి ఆత్మకథ లో
ఆధునిక కాలంలో ఆధ్యాత్మికంగా దప్పికగొన్న ఆత్మలకు క్రియాయోగాన్ని అందించిన అగ్రగామి శ్రీ శ్రీ లాహిరీ మహాశయులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు ఆయనను యోగావతారులు, “యోగం యొక్క అవతారం,”గా గౌరవిస్తారు. ఒక గృహస్థుడిగా ఉండి కూడా ఆధ్యాత్మిక సాక్షాత్కారం యొక్క అత్యున్నత స్థాయిని అందుకొని, ఒక మానవుడు ప్రాపంచిక బాధ్యతలను నిర్వహిస్తున్నప్పటికీ ఆత్మసాక్షాత్కారం యొక్క మార్గాన్ని అనుసరించవచ్చుననే దానికి ఆయన నిదర్శనంగా నిలిచారు.
లాహిరీ మహాశయులు సెప్టెంబర్ 26, 1895 నాడు తమ మర్త్య రూపాన్ని విడిచి మహాసమాధిలోకి – అనగా దైవసాక్షాత్కారం పొందిన యోగి తన శరీరం నుంచి చేసే సచేతన అంతిమ నిష్క్రమణ – ప్రవేశించారు. ఈ రోజును స్మరించుకొనేందుకు, ఒక వై.ఎస్.ఎస్. సన్యాసిచే ఆన్లైన్ ధ్యానం శుక్రవారం, సెప్టెంబర్ 26న నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం ప్రారంభ ప్రార్థన, స్ఫూర్తిదాయక పఠనం, తరువాత భక్తిగీతాలాపన, మరియు నియమిత సమయంపాటు ధ్యానాలను కూడి, పరమహంస యోగానందగారి స్వస్థతా ప్రక్రియ మరియు ఒక ముగింపు ప్రార్థనతో ముగిసింది.
ఈ విశేష సందర్భంలో, వివిధ ఆశ్రమాలు, కేంద్రాలు మరియు మండళ్ళు భక్తుల కోసం వ్యక్తిగతంగా పాల్గొనే కార్యక్రమాలను నిర్వహించాయి.
ఈ విశేషమైన రోజున, మీరు విరాళం సమర్పించాలనుకొంటే, క్రింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా సమర్పించవచ్చు. మీ ఉదారమైన విరాళాలు, చిత్తశుద్ధిగల అన్వేషకులకు క్రియాయోగ బోధనల వ్యాప్తికి సహాయపడతాయి.

















