నిర్మలానందగారు, శూలిని విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు ప్రొఫెసర్ ప్రేమ్ కుమార్ ఖోస్లా, శ్రీమతి సరోజ్ ఖోస్లా మరియు వైస్-ఛాన్సలర్ డా. అతుల్ ఖోస్లాలను కూడా చూడవచ్చు.
అఖిలభారత యువజన సంపర్క కార్యక్రమంలో ఒక నూతన అధ్యాయం
వై.ఎస్.ఎస్. యువజన సేవావిభాగం తమ అతిపెద్ద వారంరోజుల వేసవి శిబిరాన్ని హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో ఉన్న శూలిని విశ్వవిద్యాలయంలో మే 31 మరియు జూన్ 6, 2026 తేదీల మధ్య నిర్వహించింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి 11 నుంచి 17 సంవత్సరాల వయసుగల 100 మంది పైగా బాలురు, 100 మంది పైగా బాలికలు రెండు వేర్వేరు శిబిరాలలో పాల్గొన్నారు.
ఈ శిబిరాలు, మూడు వేర్వేరు వయోబృందాల వారి ప్రత్యేకమైన అవసరాలను నెరవేర్చడానికి రూపొందించబడ్డాయి – జూనియర్లు (11-13 సంవత్సరాల వారు), మధ్య-కౌమారదశలోనివారు (14-15 ఏళ్లు) మరియు సీనియర్లు (16-17 ఏళ్ల వయస్సువారు). అంతేకాకుండా, 18-23 సంవత్సరాల మధ్య వయస్సువారు, ఈ అనుభవం ద్వారా వీరు భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతమైన సేవాబాధ్యతలను మోసే స్థాయికి ఎదిగే విధంగా, సహాయక బృందనాయకులు (అసిస్టెంట్ గ్రూప్ లీడర్స్) గా నియమించబడ్డారు.
గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి జీవించడం ఎలా బోధనలపై ఆధారితమైన ఈ శిబిరం శరీరం, మనస్సు, మరియు ఆత్మల సంతులిత అభివృద్ధిని ప్రోత్సహించింది. ఆధ్యాత్మిక దినచర్య మరియు క్రమశిక్షణ ముఖ్యాంశాలుగా గల ఈ శిబిరం, ప్రతి ఉదయం మరియు సాయంత్రం, సామూహిక శక్తిపూరణ వ్యాయామాలు మరియు ధ్యానంపై దృష్టి కేంద్రీకరించింది.
వై.ఎస్.ఎస్. సన్యాసులు మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకులు నిర్వహించిన జీవించడం-ఎలా పాఠాలు నిర్భయం, ఏకాగ్రత, సంకల్పబలం, స్నేహం మరియు సహజావబోధం వంటి అంశాలపై కేంద్రీకరిస్తూ, వాటిని వయస్సుకు తగిన సామూహిక చర్చలతో జోడించి, కౌమారదశలోనివారు ముఖ్యమైన జీవన సూత్రాలను గ్రహించడంలో సహాయపడ్డాయి. ఈ తరగతులు, వై.ఎస్.ఎస్. ధ్యానప్రక్రియలపై వై.ఎస్.ఎస్. సన్యాసులు నిర్వహించిన పాఠాలతో ముగిశాయి – వీటిలో, అర్హతగల శిబిరవాసులు విశ్వశక్తితో శరీరాన్ని శక్తివంతం చేసే కళను, హాంగ్-సా ప్రక్రియ ద్వారా మనస్సును ఏకాగ్రం చేయడాన్ని, ఓం ధ్యానప్రక్రియ ద్వారా భగవంతుడితో అనుసంధానమవడాన్ని నేర్చుకున్నారు.
తల్లితండ్రుల అభిప్రాయాలు
అనేకమంది తల్లితండ్రులు తమ పిల్లలు శూలిని విశ్వవిద్యాలయంలోని వేసవి శిబిరం వల్ల ఏ విధంగా పరివర్తన చెందారో తెలియజేస్తూ, వై.ఎస్.ఎస్.కు కృతజ్ఞతతో సందేశాలు పంపించారు. వాటిలో కొన్నింటిని ఈ క్రింద చూడగలరు:
ఇంటికి చేరుకున్న తరువాత [మా అబ్బాయి] శిబిరంలో తాను నేర్చుకున్న, అనుభవించిన అద్భుతమైన విషయాలన్నింటి గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. నేను హాంగ్-సా ప్రక్రియను క్రమం తప్పకుండా సాధన చేస్తున్నానా లేదా అని నన్ను అడిగాడు. అక్కడి వాలంటీర్లు అతడిపై ఎంత ప్రభావాన్ని చూపారంటే, అతడు తాను కూడా వాలంటీర్ అవ్వాలని కోరుకుంటున్నాడు.
నిన్న మా కుమార్తెలు ఇంటికి వచ్చిన తరువాత వారు చెప్పే కథలు వినడం, రోజంతా వారు కీర్తనలు పాడుకోవడం ఎంతో ఆనందానిచ్చాయి. వారు ఎంతో ఉత్సాహంగా కీర్తనలు పాడుతున్నారు – ఇది వారి జీవితంలోకి తెచ్చిన సకారాత్మకశక్తిని అప్పుడే చూడగలుగుతున్నాను. ఈ పవిత్రమైన అభ్యాసాలు కాలక్రమేణా వారి అంతరంగంలో లోతుగా నాటుకొనిపోతాయని నాకు తెలుసు. వారు తమ అనుభవాలను – స్వామీజీ ఏమీ చెప్పారో, వాళ్ళ బృందానాయకులు వారికి ఎలా మార్గనిర్దేశం చేశారో, అలాగే వారి హృదయాన్ని తాకిన ఎన్నో చిన్న క్షణాలు – పంచుకుంటుంటే వినడం నన్ను అపారమైన ఆనందంతో నింపింది.
మా అబ్బాయి శిబిరం నుంచి విశేషమైన సానుకూల దృక్పథంతోనూ, ఒక కొత్త ఆత్మవిశ్వాసం మరియు సంతోషాలతోనూ తిరిగివచ్చాడు. ఈ శిబిరం అతడిపై చూపిన సానుకూల ప్రభావం నిజంగా హృద్యంగా అనిపించింది. ఈ బృందం చూపించిన అంకితభావం, జాగ్రత్త, మార్గదర్శకత్వం మరియు నిర్వహణ అసాధారణమైనవి. పిల్లలకు ఇటువంటి అర్థవంతమైన మరియు అభివృద్ధికారకమైన అనుభవాన్ని కల్పించడానికి వారు వెచ్చించిన సమయాన్ని, కృషిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము.
వెంటనే తృప్తీని ఆశించే ఈ వేగవంతమైన ప్రపంచంలో, పిల్లలు తమ చుట్టూరా మరియు తమ అంతరంగంలో ఏ ఆటంకం లేకుండా పరిశీలించుకోవడానికి ఈ శిబిరం ఒక అద్భుతమైన వాతావరణాన్ని కల్పించింది.
ఈ కార్యక్రమంలో నాకు నిజంగా నచ్చిన విషయం ఏమిటంటే, ఇంత చక్కటి శ్రద్ధ మరియు విలువలతో కూడిన వాతావరణంలో పిల్లలకు ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, పరిజ్ఞానం, వినోదం, స్వతంత్రత, మరియు భావోద్వేగ వికాసాల మధ్య చక్కటి సమతుల్యతను అందించడం. పిల్లలు తమతో తాము, ఇతరులతోను మరియు గురూజీ బోధనలతోను ఎంతో సహజమైన, ఆనందభరితమైన రీతిలో అనుసంధానమయ్యేలా ఈ శిబిరంలోని ప్రతి అంశం ఎంతో ఆలోచనాత్మకంగా రూపొందించబడినట్లు అనిపించింది.
నేను వ్యక్తిగతంగా గత ఐదు సంవత్సరాలుగా పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు ఎన్.సి.సి. శిబిరాలను నిర్వహిస్తున్నాను. ప్రతి శిబిరం 500 మంది విద్యార్థులను కూడి, 10 రోజులపాటు కొనసాగుతుంది. ఇటువంటి శిబిరాలను మేము సంవత్సరానికి ఐదు సార్లు నిర్వహిస్తాం. కాని, మేము సదుద్దేశంతో ఎంత ప్రయత్నించినా, పిల్లలకు ఆధ్యాత్మికంగా ప్రేరణ ఇవ్వలేకపోయాము. మేము సాధించలేకపోయినది శూలినిలోని వై.ఎస్.ఎస్. శిబిరం సాధించింది. వారి ఆంతరంగిక ఆధ్యాత్మిక కోణాన్ని స్పృశించడం ద్వారా పిల్లలు ఎంతో ప్రయోజనం పొందారు... వై.ఎస్.ఎస్. మా అబ్బాయికి ఇచ్చిన ఈ ఆధ్యాత్మిక బహుమతి గురించి నా భావాలను నేను మాటలలో వ్యక్తం చేయలేను.
శిబిరాల యొక్క వీడియో ముఖ్యాంశాలు
అద్భుతమైన ప్రకృతి నేపథ్యం
హిమాలయ పర్వతపాద ప్రాంతాలలో, శివాలిక్ పర్వతశ్రేణి నడుమ ఉన్న శూలిని విశ్వవిద్యాలయం, సుందరమైన కాలిబాటలు (హైకింగ్ ట్రయల్స్) మరియు దేవదారు వనాలు అల్లికగా కూడిన 25 ఎకరాల విశాలమైన ప్రాంగణాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆవరణ సుందరమైన దృశ్యాలను, చల్లటి వాతావరణాన్ని, మరియు శాంతిమయమైన పరిసరాలను అందిస్తుంది. ఈ స్ఫూర్తిదాయకమైన పరిసరాలు శిబిరవాసుల అనుభవంలో ఒక ముఖ్యభాగమై, సంతోషదాయకమైన అభ్యాసాన్ని మరియు ప్రకృతిలో భగవంతుడి ఉనికి యొక్క లోతైన గ్రహింపును వృద్ధి చేశాయి.
బాలురకు మరియు బాలికలకు వేర్వేరు శిబిరాలు
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షల నుంచి సందేశం
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి గారి నుంచి వచ్చిన స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని సీనియర్ వై.ఎస్.ఎస్. సన్యాసి స్వామి లలితానంద గిరి చదివి, వివరించడంతో ఆ కార్యక్రమం ప్రారంభమయ్యింది (దిగువన చూడండి).
కౌమారదశలోని యువజనుల ఆధ్యాత్మిక శిక్షణ
సామూహిక ధ్యానాలు మరియు ధ్యానప్రక్రియల సమీక్షా పాఠాలు
బాలుర శిబిరం ప్రతిరోజూ, సామూహిక శక్తిపూరణ వ్యాయామాల అభ్యాసం మరియు సామూహిక ధ్యానాలతో ప్రారంభమై, వాటి తోటే ముగిసేది.
జీవించడం ఎలా తరగతులు
విశ్వవిద్యాలయంలోని సదస్సు మందిరాలలో (సెమినార్ హాళ్లలో) “సహజావబోధం” మరియు “నిర్భయం” అన్న అంశాలపై పరస్పర చర్చలతో కూడిన సదస్సులను స్వామి లలితానంద మరియు స్వామి నిర్మలానంద నిర్వహించారు. అంతేకాకుండా, అనుభవజ్ఞులైన బృందనాయకులు “సంకల్పబలం” వంటి ఇతర ఉపయోగకరమైన విషయాలను పరిశోధించి, వాటిపై చర్చలు జరిపారు.
దైనందిన ఆత్మపరిశీలన
పిల్లలు ప్రతిరోజు, తమ వసతి గదులలో గురుకథ (ఆరుగురు వై.ఎస్.ఎస్. గురువుల జీవితాలలోని కథలు), గీతా పఠనం, సాంస్కృతిక కార్యక్రమాల అభ్యాసం మరియు ఆత్మపరిశీలన (ఆత్మపరిశీలన పట్టిక సహాయంతో) లతో కూడిన బృంద సమావేశాలలో పాల్గొంటూ తమ రోజును ముగించేవారు. తమ దైనందిన జీవితంలోని ప్రతి అంశాన్ని ఆధ్యాత్మికం చేసుకునే విధానాలను యువజనుల లేత మనసులలో నాటడమే ఈ ప్రయత్నం యొక్క ఉద్దేశం.
బాబాజీ గుహ
“బాబాజీ గుహ”ను – వనంలో దాగియున్న ఒక స్థలంలో, సహజపరిణామంలో చేయబడిన ఒక బాబాజీ ప్రతిరూపం ప్రతిష్టింపబడిన ఒక గుహవంటి గుడారాన్ని – దర్శించడం పిల్లలు ఎంతో ఇష్టపడిన ఒక కార్యక్రమం.
మహావతార్ బాబాజీ కథలను ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న యువజనులు.
విద్యావినోదాలతో కూడిన కార్యక్రమాలు
బాలుర శిబిరం, బాలలు మరియు యువజనులను సరదాగా ఉంచుతూనే, వారిలో క్రమశిక్షణను మరియు ఆత్మావలోకనాన్ని పెంపొందించే అనేక కార్యక్రమాలను కూడి ఉంది.
విశ్వవిద్యాలయ ప్రాంగణ పర్యటన
యుక్తవయస్కులైన (సీనియర్) బాలురకు ఆధునిక విజ్ఞానశాస్త్ర ప్రపంచాన్ని ఆసక్తికరంగా పరిచయం చేసిన విశ్వవిద్యాలయ ప్రాంగణ పర్యటనలు.
క్రీడలు మరియు ఆటలు
బాలుర కోసం ఏర్పాటు చేసిన క్రీడలలో టేబుల్ టెన్నిస్, క్రికెట్, సాకర్ మరియు ఇతర క్రీడలు కూడా ఉన్నాయి.
అరణ్యంలో నడకలు
అడవిలోని కాలిబాటలపై నడవడం సీనియర్ యువజనులకు బాగా నచ్చిన ఒక కార్యక్రమం.
అటవీకరణ కార్యక్రమం
బేకింగ్
కళలు మరియు చేతిపనులు
బృందాలలో కుటుంబ-శైలి భోజనాలు
9 మంది శిబిరవాసుల బృందాలు, ముగ్గురు బృందనాయకుల (పెద్దల)తో, కుటుంబ-భావన కలిగేలా, రోజుకు మూడుసార్లు కలిసి భోజనం చేసేవారు. యోగశాస్త్ర సూత్రాలను అనుసరిస్తూ, ఒకరికొకరు వడ్డించుకుంటూ, మౌనంగా భోజనం చేసి, ఆ తరువాత శుభ్రపరచడంలో సహాయం చేసేవారు.
ప్రత్యేక భోజనం ప్రేమపూర్వకంగా అందించేవారు.
సాంసృతిక, ఆధ్యాత్మిక వేడుకలు
సాంస్కృతిక కార్యక్రమం
గురూజీ బోధనలలోని కథల ఆధారితమైన నాటకాంకాలను ప్రదర్శించే ఒక సాయంత్ర ప్రదర్శనను శిబిరవాసులు నిర్వహించారు. వివిధ రకాల సంగీత వాయిద్యాలను కలిగియున్న విశ్వగీతాల (కాస్మిక్ చాంట్స్) యొక్క సమష్టి ప్రదర్శన కూడా ఈ కార్యక్రమంలో ఒక భాగం (క్రింద చూడండి).
ఆధ్యాత్మిక మేళా
శిబిరం యొక్క ఆఖరిరోజున, ఉన్నత యుగమైన ద్వాపర యుగంలో జీవితం ఎలా ఉంటుందో ఊహించడానికి, ఒక సృజనాత్మకమైన కార్యక్రమాన్ని బృందనాయకులు నిర్వహించారు. సహజావబోధం, మనోభావ గ్రహణ (మైండ్ రీడింగ్), జ్ఞాపకశక్తి, సంఘటిత శ్రమ (టీమ్ వర్క్) మొదలైన విషయాలతో కూడిన ఆటల్లో పిల్లలు పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక మేళా ఘనంగా విజయవంతమయ్యింది!
యువజనులతో కలిసి ఆధ్యాత్మిక మేళాలో పాల్గొన్నారు.
అభిప్రాయాలు
“ధ్యాన సమయాలు అద్భుతంగా జరిగాయి, అలాగే జీవించడం ఎలా తరగతులు జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మొత్తానికి, నేను చాలామంది కొత్త స్నేహితులను సంపాదించుకున్నాను; అన్నింటి కంటె ఎక్కువగా నాకు కళలు మరియు చేతిపనుల కార్యక్రమం నచ్చింది.”
“ఈ సంవత్సరంలోను, నా జీవితంలోను కూడా, ఈ శిబిరం చిరస్మరణీయమైనది... నాకు కొత్త స్నేహితులు లభించారు. మొత్తానికి, ఇది చాలా మంచి శిబిరం; శక్తిపూరణ వ్యాయామాలు, ధ్యానాలు చాలా బాగా అనిపించాయి.”
“ధ్యానం మరియు ధ్యానప్రక్రియలకు సంబంధించినవన్నీ చాలా బాగున్నాయి. నిజంగా చెప్పాలంటే, ఈ శిబిరాన్ని నిర్వహించిన విధానం నాకు చాలా నచ్చింది. అడవిలో నడకలు, సినిమా, విజ్ఞానశాస్త్ర పర్యటన (సైన్స్ టూర్), శిలపై చిత్రలేఖనం (రాక్ పెయింటింగ్), బాబాజీ గుహ వంటివి నాకు ముఖ్య ఆకర్షణలుగా అనిపించాయి.”
ప్రారంభోత్సన కార్యక్రమం
కౌమారుల (టీనేజర్ల) ఆధ్యాత్మిక శిక్షణ
సామూహిక ధ్యానాలు మరియు ధ్యానప్రక్రియల సమీక్షా తరగతులు
బాలికల శిబిరం ప్రతిరోజూ, సామూహిక శక్తిపూరణ వ్యాయామాల అభ్యాసం మరియు సామూహిక ధ్యానాలతో ప్రారంభమై, వాటి తోటే ముగిసేది.
కళను వివరిస్తున్న స్వామి లలితానంద.
జీవించడం ఎలా తరగతులు
యువజనుల చర్చలను మార్గనిర్దేశం చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందిన అనుభవజ్ఞులైన అధ్యాపకులు, స్నేహం, సంకల్పబలం, దయ వంటి విషయాలపై (ఈ క్రింద చూపించిన విధంగా) ఆరుబయట మరియు భవనాల లోపల కూడా తరగతులను నిర్వహించారు.
బాబాజీ గుహ
బాలికల హాస్టల్ ప్రాంతంలో ప్రత్యేకంగా వారి వినియోగం కోసం మరొక “బాబాజీ గుహ” ఏర్పాటు చేయబడింది. విశ్వగీతాలాపనలోను, ధ్యానంలోను మరియు కథలు చెప్పుకోవడంలోను బృందనాయకులు వారికి నేతృత్వం వహించారు.
విద్యావినోదాలతో కూడిన కార్యక్రమాలు
బాలికల శిబిరం, బాలలు మరియు కౌమారులను సరదాగా ఉంచుతూనే, వారిలో క్రమశిక్షణను మరియు ఆత్మావలోకనాన్ని పెంపొందించే అనేక కార్యక్రమాలను కూడి ఉంది.
విశ్వవిద్యాలయ ప్రాంగణ పర్యటన
కళల (సైన్స్ మరియు ఆర్ట్స్) రంగాలలో ఉన్న పరిశోధన (రీసెర్చ్) అవకాశాలు పరిచయం చేయబడ్డాయి.
క్రీడలు మరియు ఆటలు
ఫ్రిస్బీలతో పాటు భవనం లోపల ఆడే (ఇండోర్) ఆటలు కూడా ఉన్నాయి.
అరణ్యంలో నడకలు
ధ్యానం మరియు వనభోజనాలతో (పిక్నిక్ లంచ్) కూడిన రమణీయమైన నడకలలో యువజనులు పాల్గొన్నారు.
బేకింగ్
కళలు మరియు చేతిపనులు
విశ్వవిద్యాలయం యొక్క నివాస కళాకారులు (ఆర్టిస్ట్-ఇన్-రెసిడెన్స్) శిల్ప చిత్రలేఖనంపై పాఠాలను నిర్వహించారు. వాళ్లు రంగులు వేసిన రాళ్లను…
…ఇతర కళలు మరియు చేతిపనుల రూపకల్పనలను చూపిస్తున్న శిబిరవాసులు.
బృందాలలో కుటుంబ శైలి భోజనాలు
బాలుర శిబిరంలో లాగానే, బాలికల శిబిరంలో కూడా, 9 మంది శిబిరవాసుల బృందాలు, ముగ్గురు బృందనాయకుల (పెద్దల)తో, కుటుంబ-భావన కలిగేలా, రోజుకు మూడుసార్లు కలిసి భోజనం చేసేవారు. యోగశాస్త్ర సూత్రాలను అనుసరిస్తూ, ఒకరికొకరు వడ్డించుకుంటూ, మౌనంగా భోజనం చేసి, ఆ తరువాత శుభ్రపరచడంలో సహాయం చేసేవారు.
సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వేడుకలు
సాంస్కృతిక కార్యక్రమం
శిబిరం చివరి రోజున బాలికలు, అద్భుతంగా రూపొందించబడిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించారు.
ఆధ్యాత్మిక మేళా
బాలుర శిబిరంలోని బృందనాయకులు భవిష్యత్తుకు చెందిన ఒక ద్వాపరయుగ సంబంధిత కార్యక్రమాన్ని సృష్టించగా, బాలికల శిబిరం, శిబిరవాసులను గత ద్వాపరయుగ కాలానికి, అనగా, కృష్ణభగవానుడి కాలానికి తీసుకొని వెళ్లారు. గోపికలలాగా వేషధారణ చేసిన శిబిరవాసులు చిన్న చిన్న ఆటలను ఆడి, చివరగా భక్తిపూర్వకంగా, ఆనందభరితంగా ప్రదర్శించబడిన రాసలీల ఘట్టంతో కార్యక్రమాన్ని ముగించారు..
అభిప్రాయాలు
“ఇది నా మొదటి శిబిరం. ఇంత కన్నా అద్భుతమైనది నాకింత వరకు అనుభవంలోకి రాలేదు! ఈ విశ్వవిద్యాలయ ఆవరణ నాకెంతో నచ్చింది; ఇది శిబిరానికి చక్కటి నేపథ్యాన్ని కల్పించింది – చల్లని ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి చెట్లు, కిలకిలారావాలు చేసే పక్షులు! నేను అన్ని కార్యక్రమాలను, ప్రత్యేకంగా సినిమాను, ఆనందించాను. జీవితంలో ఎంతో ముఖ్యమైనాగానీ సాధారణంగా నా దృష్టికి రాని, విషయాలను ఈ శిబిరం నాకు నేర్పింది. నేను తదుపరి శిబిరం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాను.”
“భగవంతుడి పట్ల కృతజ్ఞతను సాధన చేయడం ఆత్మసాక్షాత్కారానికి అత్యుత్తమ మార్గమని నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఇక ముందు నేను హాంగ్-సా ప్రక్రియను అభ్యసించి, ధ్యానం చేసుకుంటాను. ఈ శిబిరం అద్భుతంగా ఉంది, సేవ కూడా చాలా బాగుంది.”
“నేను అన్నింటి కంటె ఎక్కువగా జ్ఞాపకం పెట్టుకునేవి – అర్థవంతమైన స్నేహాలు, ఎంతో జాగ్రత్త తీసుకొని, అపారమైన అవగాహన చూపించిన వాలంటీర్లు, అలాగే అన్ని విషయాలు మరియు అందరూ అద్భుతంగా కూడిన విధానం! ధ్యానాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా, అభివృద్ధికరంగా ఉన్నాయి. క్రీడలు సామర్థ్యాన్ని మరియు బృంద-స్ఫూర్తిని పెంపొందించడంలో ఎంతో దోహదపడ్డాయి! ఆహారం సాత్వికంగా ఉండడమే కాకుండా, చాలా రుచికరంగా కూడా ఉంది.”
“ఈ సంవత్సరపు శిబిరం నుంచి నేను మర్చిపోలేని విషయాలు ఏమిటంటే, అక్కడి జీవన విధానం, దినచర్య మరియు మా బృందానికి నిర్దేశించిన కార్యక్రమ పట్టిక. నేను ఎంతో నేర్చుకొని, వ్యక్తిగతంగా మరింత మెరుగైన వ్యక్తిగా ఎదిగాను. సహజంగానే, ఈ శిబిరంలో అనుభవించిన ప్రగాఢ ప్రశాంతతను ఎన్నటికీ మరచిపోను. నాకు అవసరమని నేను ఊహించనంత సుఖశాంతులను నా జీవితంలోకి తీసుకువచ్చినందుకు వై.ఎస్.ఎస్. కు నా హృదయపూర్వక ధన్యవాదాలు.”
ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన ప్రత్యేక అతిథి
బాలురు మరియు బాలికలు, రెండు శిబిరాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వై.ఎస్.ఎస్. సీనియర్ సన్యాసి అయిన స్వామి స్మరణానంద విచ్చేశారు. వై.ఎస్.ఎస్. బాలలు మరియు కౌమారుల రెండు శిబిరాలను ఏకకాకంలో విజయవంతంగా నిర్వహించడానికి తమ విశ్వవిద్యాలయాన్ని, దాని వివిధ సదుపాయాలను, సిబ్బంది సహకారాన్ని అందించినందుకు గాను, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున ఆయన ఖోస్లా కుటుంబాన్ని సత్కరించి, వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలిపారు.
ముగింపు కార్యక్రమంలో శిబిరవాసులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, భగవంతుడు వారికిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, సంతోషకరమైన మరియు విజయవంతమైన జీవితాలను గడపాలని వారిని ప్రోత్సహించే వీడ్కోలు సందేశంతో వారికి ప్రేరణనిచ్చారు. స్వామి స్మరణానంద,ఒక ఆపిల్ గింజను పైకిత్తి చూపిస్తూ, ఒక చిన్న గింజ ఎలాగైతే ఎన్నో పండ్లను ఇచ్చే మహావృక్షంగా ఎదుగుతుందో, అలాగే వారి జీవితాలు కూడా తమకు మరియు సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలని శిబిరంలో పాల్గొన్నవారికి చెప్పారు.
గురుదేవుల రక్షణా ఛత్రం
శిబిరాల ప్రారంభానికి ముందురోజుల్లో, సోలన్ పట్టణంలోవాతావరణం వెచ్చగా ఉండడమే కాక, దూరంగా కార్చిచ్చులు కూడా కనిపించాయి. శిబిరాల ప్రారంభం రోజున, మేఘాలు, వర్షం మరియు చల్లనిగాలుల రూపంలో గురుదేవుల రక్షణ ఛత్రం ఆ ప్రాంతాలపైన వ్యాపించింది. వారమంతా అడపాదడపా జల్లులతో మరియు మేఘావృతమైన ఆకాశంతో, కార్యక్రమాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగాయి. ఆశ్చర్యకరంగా, శిబిరాలు ముగిసిన మరుసటిరోజు సూర్యుడు మళ్లీ ప్రకాశవంతంగా ఉదయించాడు!
ఆధునిక సౌకర్యాలతో కూడిన అందమైన హిమాలయ విశ్వవిద్యాల ప్రాంగణంలో జరిగిన ఈ చారిత్రాత్మకమైన వై.ఎస్.ఎస్. శిబిరం, వాలంటీర్లు మరియు బృందనాయకుల సహకారం వల్ల మరియు మహాగురువుల ప్రత్యక్ష మరియు పరోక్ష అనుగ్రహాల వల్ల సాధ్యమయ్యింది.
శిబిరవాసుల కృతజ్ఞతా భావం ఈ క్రిందనున్న చిత్రంలో వెల్లడవుతోంది; ఇందులో బాలికలు, ఇలా వ్రాసి ఉన్న ఒక ఫలకాన్ని చూపిస్తున్నారు: “భగవంతుడితో సమస్తమూ సాధ్యమే!”























